కార్పొరేషన్, మార్చి 16: రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కరీం‘నగరం’ గులాబీమయమైంది. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నగరంలోని రాంపూర్, కమాన్, తెలంగాణ తల్లి చౌరస్తా, బస్టాండ్, మంకమ్మతోట, రాంనగర్, మార్క్ఫెడ్ సభాస్థలి, ఇతర చౌరస్తాలు గులాబీ జెండాలు, తోరణాలతోపాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కటౌట్లతో గులాబీమయమయ్యాయి. వీటితో పాటు ప్రధాన చౌరస్తాలన్నింటిలోనూ భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం కరీంనగర్కు చేరుకునే మంత్రి కేటీఆర్కు తిమ్మాపూర్ మండల కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్కడి నుంచి ఐదు వేల బైక్లతో భారీ ర్యాలీగా మానేరు బ్రిడ్జి దాకా తరలిరానున్నారు.
పర్యటన ఇలా..
మంత్రి కేటీఆర్ ముందుగా మానేరు బ్రిడ్జి వద్ద రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి రాంనగర్లోని మార్క్ఫెడ్ మైదానం దాకా బైక్ ర్యాలీగా వెళ్తారు. అనంతరం మార్క్ఫెడ్ మైదానంలో రూ.615 కోట్లతో నగరంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడతారు. సభకు నియోజకవర్గం నుంచి 25 వేల మందికి పైగా తరలిరానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సభ అనంతరం నేరుగా చొప్పదండి మున్సిపాలిటీకి చేరుకుంటారు. అక్కడ సుమారుగా రూ.38 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. అనంతరం అక్కడే భోజన కార్యక్రమాలను పూర్తి చేసుకొని సాయంత్రానికి కరీంనగర్కు చేరుకుంటారు. ఉజ్వల పార్కు సమీపంలో రూ.5 కోట్ల వ్యయం తో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే జిల్లాలోని కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమిషనర్లు, మున్సిపల్ అధికారులతో సమావేశమవుతారు. ఆయా మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి, ఇతర కార్యక్రమాలపై సమీక్షిస్తారు. అనంతరం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంపు కార్యాలయానికి చేరుకొని తేనీటి విందు స్వీకరించి, తిరిగి హైదరాబాద్కు పయనమవుతారు.
విస్తృత ఏర్పాట్లు చేశాం: మంత్రి గంగుల
మంత్రి కేటీఆర్ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయాచోట్ల ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా మార్క్ఫెడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదికను, ప్రజల కోసం వేసిన టెంట్లు, ఇతర పరిసరాలు, అనంతరం మానేరు బ్రిడ్జి, బీసీ స్టడీ సర్కిల్ వద్ద చేపట్టిన పనులను పరిశీలించారు. సభకు వచ్చే వారికి ఇబ్బంది కలుగకుండా మంచినీటి సదుపాయం కల్పించాలని శ్రేణులకు సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పర్యటనలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, అంతకుముందు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. పర్యటన వివరాలు వెల్లడించారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, సూడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యామ్ప్రసాద్లాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, అడిషనల్ డీసీపీ చంద్రమోహన్, ఏసీపీ తులా శ్రీనివాస్రావు, నీటిపారుదల శాఖ ఎస్ఈ శివకుమార్ అధికారులు పాల్గొన్నారు.