రాజన్న సిరిసిల్ల, మార్చి 7 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల/ సిరిసిల్ల టౌన్ : ‘సర్వేలన్నీ చెబుతున్నయి. ట్రయాంగిల్లో కరీంనగర్ ఎంపీగా వినోదన్నదే విజయం. ఎవరి బూత్లో వారు బీఆర్ఎస్ విజయం కోసం ఈ నలభై రోజులు బాగా కష్ట పడాలి’ అని కార్యకర్తలకు వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బండిని ఇంటికి పంపాలని ప్రజలు చూస్తున్నారని, కాంగ్రెస్కు ఓటు వేస్తే మోసం అవుతుందన్న ఆలోచనలో ఉన్నారని, క్షేత్ర స్థాయిలో బాగా కష్టపడితే ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తారని చెప్పారు. తాను ఇక్కడ గెలిచి మంత్రినయ్యానని, రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్లనేనని పునరుద్ఘాటించారు. ఎక్కడికెళ్లినా సిరిసిల్ల గురించి గర్వంగా చెప్పుకుంటానన్నారు.
అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా సిరిసిల్లను నిలిపానని చెప్పారు.ఈనెల 12న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో పార్టీ నిర్వహించే కదనభేరి సభను విజయవంతం చేయాలని, అందుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన జరిగిన సిరిసిల్ల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. కదనభేరి పోస్టర్ను ఆవిష్కరించారు. మార్చి 8న అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, పార్లమెంటులో తెలంగాణ గొంతుక వినిపించేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనన్నారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైలు మార్గం కోసం కృషి చేసింది బీఆర్ఎస్ నాయకుడు బోయినపల్లి వినోద్కుమార్ అని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి గెలిస్తే లాభం జరుగుతుందని చెప్పారు.
నిర్దేశించిన మేరకు వార్డుల్లోని ఓటర్లను కలిసి అభ్యర్థి గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. పద్మశాలీ సమాజం కోసం వారి జీవన ప్రమాణాలు పెంచేలా కృషి చేశానని చెప్పారు. నేతన్నలకు బతుకమ్మ ఆర్డర్లు ఇచ్చే వరకు, రూ.200ల కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేసే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. ఈ వారంలోగా ప్రభుత్వం స్పందించక పోతే నేతన్నలతో కలిసి మహాధర్నా చేపడుతానని చెప్పారు.
ఇప్పటికే పరిశ్రమ బంద్ వల్ల ఉపాధి లేక నేతన్నలు రోడ్డున పడ్డారని, పరిస్థితి చేయిదాటితే మళ్లీ సిరిసిల్ల ఉరిసిల్లగా మారే ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పద్మశాలీ సమాజానికి అండగా ఉంటానని, నేతన్నల సమస్యల పరిష్కారం కోసం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం వర్కర్టూ ఓనర్ పథకాన్ని తెచ్చి వర్క్ షెడ్లు నిర్మిస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం బడావ్యాపారులకు, కాంట్రాక్టర్లకు అప్పగించాలని కుట్ర పన్నుతుందని ఆరోపించారు.
మోసగాళ్లు, దగుల్భాజీలు కాంగ్రెసోళ్లుని ప్రజలకు తెలిసి పోయిందన్నారు. ఓటు వేసి మోసపోయినమని గుర్తించి బీఆర్ఎస్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారన్నారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి పైసా పనిచేయలేని విమర్శించారు. సిరిసిల్ల నేతన్నల పరిస్థితి దయనీయంగా మారినా ఒక్కసారైనా వచ్చి చూశాడా..? వారి గురించి పార్లమెంటులో చర్చించాడా..? అని ప్రశ్నించారు. మెగాక్లస్టర్ తీసుకొచ్చి నేతన్నల సమస్యలు ఏవైనా పరిష్కరించాడా..? అంటూ మండిపడ్డారు. రాముడి ఫొటో కింద తన ఫొటో పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడంటూ విమర్శించారు.
వచ్చే ఎంపీ ఎన్నికల్లో వినోద్ కుమార్ భారీ మెజార్టీ సాధిస్తారనే నమ్మకం ఉన్నది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా గ్రామ, పట్టణ వార్డుల వారీగా కార్యకర్తలందరం బాధ్యతగా పనిచేద్దాం. గెలుపే లక్ష్యంగా సమిష్టి కృషితో భారీ మెజార్టీ సాధిద్దాం. సిరిసిల్ల నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాలల్లో పకడ్బందీగా కార్యాచరణతో ముందుకుసాగుదాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సహకారంతో అన్ని రకాల కమిటీలను నియమించుకుందాం. ఈ నెల 12న కరీంనగర్లో నిర్వహించే కదనభేరి సభను విజయవంతం చేద్దాం. ఉద్యమంలో కరీంనగర్ సెంటిమెంట్ విజయాన్ని పార్లమెంటు ఎన్నికల్లో నిజం చేయాలి. అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలిరావాలి.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు (రాజన్నసిరిసిల్ల)