రాజన్న సిరిసిల్ల, మార్చి 8 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్: నేతన్నకు బతుకుదెరువుగా నిలిచిన బతుకమ్మ చీరల ఆర్డర్లు, పెండింగ్లో ఉన్న 200కోట్ల బకాయిలు ఈ నెల 14లోపు చెల్లించాలని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, బీ వినోద్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేతన్నల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోకుంటే ఈ నెల 15న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేలాది మంది నేతన్నలతో సిరిసిల్లలో మహాధర్నా చేస్తామని హెచ్చరించారు. రేవంత్రెడ్డిది కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని తెలంగాణ ప్రజలకు ధర్నా ద్వారా తెలియజేస్తామని స్పష్టం చేశారు.
అందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొంటారని చెప్పారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వరాష్ట్రంలో సిరిసిల్ల పవర్లూం కార్మికులకు బతుకుదెరువు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ వస్ర్తాలు, ఆర్వీఎం స్కూల్ యూనిఫాంల తయారీకోసం ఆర్డర్లు ఇచ్చి ఆదుకున్నదన్నారు. కానీ, కాంగ్రెస్ సర్కారు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకుండా నేతన్నల పొట్టగొడుతున్నదని, గతంలో తయారు చేసిన వస్ర్తాలకు సంబంధించి 200 కోట్లు విడుదల చేయక పోవడంతో యజమానులు, ఆసాములు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
తెచ్చిన అప్పులు కట్టలేక సాంచాలు బంద్పెట్టారని, ఫలితంగా కార్మికులంతా పనిలేక రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేత కార్మికులకు అన్యాయం చేయవద్దని, వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాక ముందు సిరిసిల్ల ఉరిసిల్లగా మారితే నాడు ఉద్యమ సమయంలో ఎంపీగా ఉన్న కేసీఆర్ జోలె పట్టి చందాలు పోగు చేసి 50లక్షలు పద్మశాలీ ట్రస్టుకు అందించి ఆదుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కేసీఆర్ సర్కారు హయాంలో నేత కార్మికులకు 3400 కోట్ల ఆర్డర్లు ఇచ్చినట్లు చెప్పారు. ‘కత్తెర పెడతాం.. పేగులు మెడలో వేసుకుంటాం’ అని సీఎం స్థాయిలో ఉన్న రేవంత్రెడ్డి మాట్లాడడం పద్ధతి కాదని, ప్రజాస్వామ్యంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇంట్లాంటి మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. రాష్ర్టాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించాలే కానీ, పనికి మాలిన మాటలు మాట్లాడవద్దని సూచించారు.
కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డికి ధైర్యముంటే సీఎం వద్దకు వెళ్లి కార్మికులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయించాలని, మళ్లీ బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇప్పించాలని వినోద్ కుమార్ సూచించారు. ‘ఇన్నాళ్లూ సిరిసిల్ల నేత కార్మికులు బాగా దొబ్బితిన్నారంటూ’ ఆయన మాట్లాడడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డర్లను రద్దు చేస్తామని అనడం ఏంటని, ప్రభుత్వం సిరిసిల్లకు ఆర్డర్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇక్కడి నేతన్నల దయనీయ పరిస్థితి చూసైనా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బకాయిలు విడుదల చేస్తారని ఆశిస్తున్నామన్నారు. కానీ, బకాయిలు విడుదల చేయాలని మంత్రి తుమ్మలను అడిగితే, కేకేను వెంట తీసుకొనిరమ్మనడంలో ఆంతర్యమేమిటని, రాజకీయాలకు బకాయిల చెల్లింపులకు సంబంధం ఏంటని ఫైరయ్యారు.
తెలంగాణ వచ్చిన తర్వాత నేత కార్మికులను బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకుదెరువు చూపిందని, బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ వస్ర్తాల తయారీ ఆర్డర్లు ఇచ్చి జీవితాల్లో వెలుగులు నింపిందని వినోద్కుమార్ గుర్తు చేశారు. ఒకప్పుడు ఇక్కడి నేత కార్మికులు బతుకు దెరువు కోసం షోలాపూర్, సూరత్, భీవండీ లాంటి ప్రాంతాలకు వలస పోయేవారని, కానీ, రాష్ట్రం వచ్చాక కేసీఆర్ సర్కారు ఇచ్చిన ప్రోత్సాహం, చూపిన బతుకుదెరువుతో ఎంతో మంది వాపస్ వచ్చారని చెప్పారు. 2001నుంచి 2008 దాకా సిరిసిల్లలో ఎక్కడ చూసినా నేత కార్మికుల ఆత్మహత్యలే కనిపించేవని, నాడు కార్మికుల బతుకులు అత్యంత దారుణంగా ఉండేవని పేర్కొన్నారు.
నాడు ఎంపీగా ఉన్న కేసీఆర్ నేతన్నలకు ఎంతో ధైర్యం చెప్పారని, ఆయన ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవడం వల్లే ఆత్మహత్యలు ఆగిపోయాయన్నారు. బీఆర్ఎస్ సర్కారు నేత కార్మికులకు చేతి నిండా పని, పనికి తగ్గ వేతనం పొందేలా బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా పదిశాతం యారన్ సబ్సిడీ 36కోట్లు కూడా ఇచ్చినట్లు వివరించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ టెక్స్టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్, జగిత్యాల జడ్పీ వైస్చైర్మన్ హరిచరణ్రావు, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, బొల్లి రాంమోహన్, రాజన్న, మల్లారెడ్డి, అగ్గిరాములు, జక్కుల నాగరాజు, రాజునాయక్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ సర్కారు నేతన్నలకు ఇవ్వాల్సిన బకాయిలే విడుదల చేయడం లేదు. ఇక మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలు ఎలా నెరవేరుస్తుంది. జగిత్యాల, నారాయణరావుపేట, భువనగిరిలలో పవర్లూం క్లస్టర్లు ఏర్పాటు చేసి 90శాతం సబ్సిడీ ఇస్తామని ప్రకటించిన్రు. కానీ, ఎప్పుడు చేస్తారో చెప్పాలి. ఉన్న ఆర్డర్లే ఇవ్వడం లేదు, బకాయిలు చెల్లించడం లేదు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తారన్న నమ్మకం ఏంటి?. సిరిసిల్లకు ఆర్డర్లు ఇవ్వకుండా కమీషన్లు దొబ్బితినడానికి షోలాపూర్, భీవండీ, సూరత్కు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నయ్.
-వినోద్ కుమార్