కార్పొరేషన్, జూలై 1: ‘జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట జిల్లాలో తిరుగుతున్న బీజేపీ నాయకులు అబద్ధాలు చెబుతూ రాద్ధాంతం చేస్తున్నారు. వారి మోసకారి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరు..’ అంటూ మేయర్ వై సునీల్రావు విరుచుకుపడ్డారు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరిశీలించి వారి పాలిత రాష్ర్టాల్లో అమలయ్యేలా చూడాలని హితవు పలికారు. శుక్రవారం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో విలేకరులతో మాట్లాడిన ఆయన తెలంగాణ సర్కారు చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూనే బీజేపీ వైఖరిని తూర్పారబట్టారు.
రాష్ట్ర నిధులతో ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రతి ఆవాసానికి సురక్షితమైన తాగునీరందించే లక్ష్యంతో మిషన్ భగీరథను చేపట్టారన్నారు. ఇలాంటి బృహత్తర స్కీంలకు నయాపైసా విదిల్చని కేంద్ర మంత్రులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రజల వద్దకు వస్తున్నారని నిలదీశారు. తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, ఆసరా, సాగుకు 24 గంటల ఫ్రీ కరెంట్, రైతు బం ధు, బీమా లాంటి పథకాలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఉన్నాయా..? అంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పేరు తలవకుంటే బీజేపీకి పూట గడవదని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు ప్రజల్ని ఎక్కువ కాలం మోసం చేసి రాజకీయాలు చేయలేరన్నారు. కార్పొరేటర్లు బండారి వేణు, నేతికుంట యాదయ్య, చాడగొండ బుచ్చిరెడ్డి, గుగ్గిళ్ల జయశ్రీ, గంట కల్యాణి తదితరులు పాల్గొన్నారు.