మంథని టౌన్, మే 16: మనం నిద్రలేవక ముందే రోడ్లపైకి వచ్చి చెత్తాచెదారాన్ని తొలగించి, మురుగు, మలినాలను శుద్ధి చేసే సఫాయి కార్మికులే నిజమైన ఆరోగ్య పరిరక్షకులని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అభివర్ణించారు. ప్రాణాలకు తెగించి వారందిస్తున్న సేవలకు నిదర్శనంగానే మంథని బల్దియా ఆధ్వర్యంలో సఫాయి కర్మచారుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మంథని బొక్కలవాగు మినీ ట్యాంక్బండ్ బ్రిడ్జి వద్ద మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సఫాయి కర్మచారుల విగ్రహాన్ని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహరిణితో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సఫాయి కార్మికుల సేవలకు గుర్తింపుగానే ఈ విగ్రహాన్ని నెలకొల్పామన్నారు. కరోనా కాలంలో వారు ఎనలేని సేవలందించారని కొనియాడారు. ప్రాణాలకు తెగించి శవ దహనాలు చేశారని చెప్పారు. వారందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ఉమ్మడి పాలనలో అనేక వెతలు పడ్డారన్నారు.
అరకొర వేతనాలతో ఇబ్బందులుపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఎమ్మెల్యే కాక ముందు సఫాయి కార్మికుల గృహాల పక్కనే ఉన్న బర్రె కుంటలోకి చేర్చి వారి అనారోగ్యానికి గత పాలకులు కారకులయ్యారన్నారు. ఎమ్మెల్యేగా బర్రె కుంటను అంబేద్కర్ కుంటగా మార్చి మురుగునీటిని బొక్కలవాగులోకి మళ్లించానని గుర్తుచేశారు. ఇక్కడ పచ్చదనం ఉట్టిపడేలా విరివిగా మొక్కలను నాటామన్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. పేద కుటుంబంలో పుట్టిన బిడ్డగా పుట్ట మధూకర్ సఫాయి కార్మికుల సేవలను గుర్తించి కర్మచారుల విగ్రహాలను నెలకొల్పడం యావత్ తెలంగాణలోనే మొదటిసారి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ముఖ్యమంత్రి కేసీఆర్ వారి వేతనాలను భారీగా పెంచారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు ముత్యంరావు, నాయకుడు బూడిద గణేశ్, మంథని మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షుడు చింతల గోవింద్ తదితరులున్నారు.