కరీంనగర్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ హాల్లో బుధవారం చైర్పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. కాగా, జడ్పీ సభ్యులతో సమానంగా తమకు నిధులు కేటాయించాలని కో-ఆప్షన్ సభ్యుడు షుక్రుద్దీన్ జడ్పీ పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. చట్ట ప్రకారమే వ్యవహరిస్తామని జడ్పీ చైర్పర్సన్ విజయ స్పష్టం చేశారు. అయినా వినకుండా అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. దీంతో పలువురు జడ్పీటీసీ సభ్యులు షుక్రుద్దీన్పై విరుచుకుపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించినందున సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడంతో కలగజేసుకున్న జడ్పీ చైర్పర్సన్ సభ నుంచి బయటకు వెళ్లాలని షుక్రుద్దీన్ను ఆదేశించారు. కాగా, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సముదాయించే ప్రయత్నం చేసినా షుక్రుద్దీన్ వినకుండా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
సమస్యలపై చర్చించిన సభ్యులు..
జడ్పీ సర్వసభ్య సమావేశంలో సమస్యలపై శాఖల వారీగా చర్చించారు. డీఈవో జనార్దన్ రావు మన ఊరు-మన బడి కార్యక్రమం నివేదిక సమర్పించిన తర్వాత చిగురుమామిడి ఎంపీపీ కొత్త వినీత మాట్లాడుతూ, తమ మండలంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఇప్పట్లో కొత్త ఉపాధ్యాయ పోస్టులు రాకుంటే విద్యావలంటీర్లను ఏర్పాటు చేయాలని విన్నవించగా, నియమిస్తామని తెలిపారు. చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్ మాట్లాడుతూ, డీఎస్సీ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మన ఊరు-మన బడి కార్యక్రమం గురించి డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి వివరించారు. ప్రభుత్వం గురుకులాల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో సీట్లు దొరకడం లేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్య లభిస్తున్నదని స్పష్టం చేశారు. జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరాం శ్యాం మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలని సూచించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధిపై జరిగిన చర్చలో సైదాపూర్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తమ మండల ఈసీపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని విన్నవించారు. స్పందించిన డీఆర్డీవో శ్రీలతా రెడ్డి మాట్లాడుతూ, అదనపు పీడీతో విచారణ జరిపిస్తున్నామని, నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పంచాయతీ వింగ్పై జరిగిన చర్చలో కూడా ప్రభాకర్ రెడ్డి జోక్యం చేసుకొని తమ మండల పంచాయతీ అధికారి అవకతవకలకు పాల్పడుతున్నారని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. డీపీవో వీర బుచ్చయ్య కలుగజేసుకొని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఈ విషయంలో విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. గన్నేరువరం జడ్పీటీసీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, తమ మండలంలో సుడా అనుమతి లేకుండా వెంచర్లు చేస్తున్నారని అధికారుల దృష్టికి తెచ్చారు. సుడా చైర్మన్ జీవీ రామకృష్ణా రావు జోక్యం చేసుకొని సుడాఅనుమతి లేకుండా వెంచర్లు చేయడానికి వీలు లేదని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై ఫిర్యాదు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించినా ఎందుకు పట్టించుకోవడం లేదని డీపీవోను ప్రశ్నించారు. ఇప్పటికైనా కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.
దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలు
పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దేశంలో ఎకడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. దళితబంధు పథకంతో దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. వైకుంఠధామాల వద్ద బోర్లు వేయించాలని కలెక్టర్ను కోరారు. జడ్పీ సమావేశ మందిరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైక్సెట్ను ఆమె ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, ఈనెల 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పల్లె ప్రగతితో గ్రామాలన్నీ పరిశుభ్రంగా మారడంతో డెంగ్యూ, విష జ్వరాలు తగ్గాయన్నారు.
ఆశ, అంగన్వాడీ, స్వశక్తి సంఘాలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, వైద్య బృందాలు సమావేశాలు నిర్వహించి వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్ మళ్లీ రాకుండా ప్రికాషన్ డోస్ వేయించాలన్నారు. వ్యాక్సినేషన్లో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లాలో గర్భిణులు సాధారణ ప్రసవాలు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. హుజూరాబాద్ నియోజవర్గంలో దళితబంధు పథకం కింద 13,559 మంది లబ్ధిదారులను గుర్తించి, ఇప్పటి వరకు 10,006 యూనిట్లను గ్రౌండింగ్ చేశామన్నారు. మిగతా యూనిట్లను త్వరగా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో 202 యూనిట్లను గ్రౌండింగ్ చేయడం జరిగిందని, మిగతా ఏడు యూనిట్లను వారంలోగా గ్రౌండింగ్ చేస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, డిప్యూటీ సీఈవో పవన్కుమార్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.