రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాల కల్పన, దవాఖాన నిర్వహణ, వైద్య సిబ్బంది పనితీరులో మానకొండూర్ పీహెచ్సీ, జగిత్యాలలోని మోత్వాడ అర్బన్ హెల్త్ సెంటర్కు జాతీయ ఖ్యాతి వచ్చింది. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్లో చోటు దక్కింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేయగా, దవాఖాన సిబ్బంది, గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
విద్యానగర్/మానకొండూర్ రూరల్, జూన్ 22: నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్లో ఉమ్మడి జిల్లాలోని మానకొండూర్ పీహెచ్సీ, జగిత్యాలలోని మోత్వాడ యూహెచ్సీకి చోటు దక్కింది. గత నెలలో జాతీయ స్థాయి క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్ టీం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని వీణవంక మండలం చల్లూరు, గంగాధర, కరీంనగర్లోని మోతాజీఖాన అర్బన్ హెల్త్ సెంటర్తో పాటు మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోత్వాడ అర్బన్ హెల్త్ సెంటర్ను సందర్శించారు.
దవాఖాన మెయింటెనెన్స్తోపాటు ఓపీ సేవలు, రోగులకు అందుతున్న సేవల గురించి వివరాలు సేకరించారు. అయితే ఇందులో మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. 84.83 శాతం మార్కులు సాధించినట్లు పీహెచ్సీ డాక్టర్ వినత తెలిపారు. జగిత్యాలలోని మోత్వాడ అర్బన్ హెల్త్ సెంటర్కు సైతం జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దీనికి గాను 88.2 శాతం మార్కులు వచ్చాయి. ఎంపికైన ఆరోగ్య కేంద్రానికి మూడేళ్ల పాటు ఏడాదికి రూ.3 లక్షల ప్రోత్సాహం అందించనున్నారు. కాగా, త్వరలోనే జిల్లాలోని చల్లూరు, గంగాధర, మోతాజీఖానా అర్బన్ హెల్త్ సెంటర్లను సైతం జాతీయ స్థాయి గుర్తింపు లభించనున్నట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. జాతీయ స్థాయి గుర్తింపు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.