వేములవాడ, జూన్ 22: మా కళాశాలకు రండి అంటూ ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు ప్రచారం చేస్తున్నాయి. బోధన, సర్కారు కల్పించిన సౌకర్యాలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి 42 సంవత్సరాలు పూర్తి కావస్తుండగా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధ్యాపకులు గ్రామాల్లో కూడా విస్తృత ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే వేములవాడ అర్బన్, రూరల్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల వద్ద పదో తరగతి విద్యార్థుల జాబితాను సేకరించి ఒక దఫా వేసవికాలంలోనే ప్రచారాన్ని చేశారు. ఇప్పటికే కళాశాల కూడా ప్రారంభం కాగా 30 వరకు అడ్మిషన్లు కూడా సేకరించారు. ఇక మరో దఫా పట్టణంతోపాటు అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారాన్ని చేపట్టి అడ్మిషన్ల సంఖ్యను పెంచుతామని ప్రిన్సిపాల్ ప్రమోద్ కుమార్ వెల్లడించారు.
కళాశాలకు 42 ఏళ్లు
వేములవాడ పట్టణంలో 1980లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. అప్పటివరకు సిరిసిల్ల పాత తాలూకా పరిధి సిరిసిల్లలో మాత్రమే ఉండే ఇంటర్మీడియట్ కళాశాల 1980 నుంచి వేములవాడ పట్టణంలోనూ ఏర్పాటు కావడంతో ప్రాంత ప్రజలకు ఇంటర్మీడియట్ విద్య అందుబాటులోకి వచ్చింది. దాదాపు 4 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 75కు పైగా వృక్షాలు, క్రీడా మైదానంతో కళాశాల ఏర్పాటు కాగా వేములవాడతో పాటు చందుర్తి, కోనరావుపేట, బోయినపల్లి మండలాల విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు దాదాపు 20 వేల మంది విద్యార్థులు ఈ కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తి చేసుకున్నారు.
కళాశాలలోని కోర్సులివే..
వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులున్నాయి. ఇంగ్లిష్ మీడియంలోనూ పలు కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. అలాగే వృత్తి విద్యా కోర్సులు కూడా కళాశాలలో అందుబాటులో ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్షిప్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, మల్టీ పర్సప్ హెల్త్ వర్కర్(ఫీమేల్) విభాగంలో కూడా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే విద్యార్థులకు అవసరమయ్యే పాఠ్యపుస్తకాలు కూడా కళాశాలకు చేరుకున్నాయి.
ఏడాదికి రూ.4300 ఉపకార వేతం…
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం ఏడాదికి రూ.4300 ఉపకార వేతనం అందజేస్తున్నది. నగదు పూర్తిగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలోనే వేస్తారని ప్రిన్సిపాల్ తెలిపారు. పర్యావరణ, ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి ఫీజులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
విసృత ప్రచారం..
ప్రైవేటు కాలేజీల పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ కళాశాలలు కూడా అందుకు దీటుగా పని చేస్తున్నాయి. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ఐదేళ్లుగా ప్రైవేటుకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. అన్ని రకాల కోర్సులు, కళాశాల వసతి సౌకర్యాలను విద్యార్థులకు తెలియజేస్తూ ప్రచారం చేస్తున్నారు. గతేడాది కూడా 275 మంది విద్యార్థులు కళాశాలలో చేరారు. ఇక ఈ ఏడాది కూడా కళాశాలలోని కోర్సులు, సౌకర్యాలను తెలియజేస్తూ ఫ్లెక్సీలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. కరపత్రాలను కూడా ముద్రించి గ్రామగ్రామాన తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు.
మా కాలేజీలో చేరండి..కళాశాలలోని వసతి సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య ను పెంచుతాం. వృత్తి విద్యా కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు ఇష్టపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక దఫా ప్రచారాన్ని ముగించగా మళ్లీ మరోసారి కూడా గ్రామ గ్రామాన ప్రచారం చేస్తాం.
-ప్రమోద్ కుమార్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వేములవాడ