రామవరం, జూన్ 5: సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియా పరిధిలో ఉన్న సత్తుపల్లి వద్ద జేవీఆర్ ఓసీ గనులు, కిష్టారం ఓసీ గనుల నుంచి పెద్దఎత్తున బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది. ఇక్కడి నుంచి ఉత్పత్తయ్యే సుమారు 25నుంచి 30 వేల టన్నుల బొగ్గును ప్రస్తుతం వందలాది లారీల ద్వారా అక్కడి నుంచి 60కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం(రుద్రంపూర్) సీహెచ్పీకి రవాణా చేసి అక్కడి నుంచి రైలుమార్గం ద్వారా పాల్వంచ థర్మల్ పవర్స్టేషన్, ఇతర రాష్ర్టాల థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలకు రవాణా చేస్తున్నారు. వందలాది లారీ ట్రిప్పులతో బొగ్గు రవాణా చేయడం వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ రైలుమార్గాన్ని నిర్మించి బొగ్గు రవాణా నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది.
సీఎండీ శ్రీధర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి దక్షిణ మధ్య రైల్వే జీఎం గజనాన్ మాల్యాతో చర్చించి ఇరుసంస్థల భాగస్వామ్యంతో 54 కిలోమీటర్ల రైలుమార్గం నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం రూ.927.94 కోట్ల నిర్మాణ వ్యయంలో సింగరేణి రూ.618.55 కోట్లు కాగా దక్షిణమధ్య రైల్వే రూ.309.39 కోట్లు చెల్లించడానికి అంగీకరించగా రైల్వేశాఖ ఆధ్వర్యంలో 2020 ఫిబ్రవరిలో నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్మాణ వ్యయ ఖర్చులను సింగరేణి సంస్థ ముందస్తుగానే చెల్లిస్తూ వచ్చింది. సింగరేణి సీఎండీ శ్రీధర్ ఈ రైలుమార్గ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రత్యేక చొరవ చూపుతూ తరచూ పనుల ప్రగతిని సమీక్షించారు. రైలుమార్గం కోసం 355 హెక్టార్ల భూమిని సేకరించాల్సి రాగా, భూసేకరణ విషయంలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టు నిరాటంకంగా పూర్తవ్వడంలో కృషి చేశారు.
రైలు మార్గంలో 102 బ్రిడ్జిలు
ఈ రైలు మార్గంలో హైదరాబాద్, విజయవాడ హైవేలపై భారీ రోడ్డు ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. అలాగే సత్తుపల్లి సమీపంలో సీతారామ ప్రాజెక్టు కాలువపై కూడా పొడవైన రైలు వంతెనను నిర్మించారు. వీటితో కలిపి మొత్తం 10 ఈ తరహా పెద్ద వంతెనలు నిర్మించారు. ఇవికాక కాలువలు, వాగులు, వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లపై, 44 మైనర్ బ్రిడ్జిలు, 41 రైల్ అండర్ బ్రిడ్జిలు, 7 రైల్వే ఓవర్బ్రిడ్జిలు నిర్మించారు.
రూ.470 కోట్లతో అత్యాధునిక సీహెచ్పీ
ఇదిలాఉంటే ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించిన రైలుమార్గం సత్తుపల్లికి సమీపంలోని లంకపల్లి వద్ద ముగుస్తుండగా అక్కడి నుంచి సింగరేణి గనులు వద్ద నిర్మించిన సీహెచ్పీ వరకు 3.2 కిలోమీటర్ల రైలు మార్గాన్ని సింగరేణి సంస్థ సొంతంగా నిర్మించింది. సీహెచ్పీ యార్డులో అవసరమైన మరిన్ని లైన్లు కూడా నిర్మించింది. ఈ విధంగా మొత్తం మీద 10.17 కిలోమీటర్ల రైలు మార్గాన్ని సంస్థ రూ.180 కోట్లను వెచ్చించి సొంతంగా నిర్మించింది. రైలు లోడింగ్ కోసం రూ.470 కోట్లతో సింగరేణి సంస్థ అత్యాధునిక పర్యావరణహిత సీహెచ్పీని ఇక్కడ నిర్మించింది. ఏడాదికి వంద లక్షల టన్నుల బొగ్గు లోడింగ్ జరిపే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. దీనివల్ల నిర్ధిష్టమైన గ్రేడ్ బొగ్గును వినియోగదారులకు సరఫరా చేసే అవకాశం ఏర్పడింది.
సింగరేణి భాగస్వామ్యంతో నిర్మించిన తొలిపెద్ద రైలు మార్గం
రాష్ట్రంలో సింగరేణి భాగస్వామ్యంతో నిర్మించిన అతిపెద్ద రైలు మార్గం ఇదే అని రైల్వే అధికారులు ప్రశంసిస్తున్నారు. ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించిన ఈ రైలు మార్గం వల్ల సత్తుపల్లి – కొత్తగూడెం మధ్య ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు కాలుష్యం, ప్రమాదాలు కూడా తగ్గిపోతాయి. రైలుమార్గం అందుబాటులోకి రావడంతో వినియోగదారులకు వేగంగా సురక్షితంగా నాణ్యమైన బొగ్గు అందుతున్నది.
కల సాకారమైంది
సంస్థ సీఎండీ, డైరెక్టర్లు, అధికారుల సహకారంతో తక్కువ వ్యవధిలోనే గొప్ప ప్రాజెక్టును పూర్తిచేశాం. ఈ రైల్వే ప్రాజెక్టు నిర్మాణం వల్ల పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసినైట్లెంది. సత్తుపల్లి- కొత్తగూడెం మధ్య ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు కాలుష్యం, ప్రమాదాలను నివారించవచ్చు. సుదూర ప్రాంతాలకు బొగ్గు రవా ణా వేగంగా సురక్షితంగా జరుగుతుంది. కొవ్వూరు రైల్వేలైన్కు మార్గం సుగమమైంది.
-సీహెచ్.నర్సింహారావు, కొత్తగూడెం ఏరియా జీఎం