కరీంనగర్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచనా విధానంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది వరకే నిర్వహించిన నాలుగు విడుతల పల్లెప్రగతి, మూడు విడుతల పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలను ప్రజల భాగస్వామ్యంతో పరిష్కరించింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 ద్వారా గ్రామాల అభివృద్ధికి పూర్తి బాధ్యత పంచాయతీలకు అప్పగించిన ప్రభుత్వం ఇందులో ప్రజల భాగస్వామ్యం ఉండాలనే ఆలోచన ఆచరణలోకి వచ్చింది. మొదటి విడుతలో గ్రామాలు, పట్టణాల ప్రజలు పోటీ పడి ప్రభుత్వం ఇచ్చిన కార్యాచరణను సాధించి చూపించారు. దీంతో పారిశుధ్యం మెరుగుపడింది. పాడుబడిన బావులు పూడ్చివేశారు. శిథిలమైన గృహాలను తొలగించారు. రోడ్లు, మురుగు కాలువలను గ్రామస్తులు శ్రమదానాల ద్వారా శుభ్రపర్చుకున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, డంప్ యార్డులు వంటి అనేక మౌలిక సదుపాయాలను ప్రతి గ్రామం నెలకొల్పుకున్నది. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ సమకూర్చుకోవడంతో ఇటు పారిశుధ్యానికి, అటు మొక్కలను సంరక్షించుకోవడానికి అవకాశం ఏర్పడింది. పల్లెప్రగతికి ముందు, తర్వాత గ్రామాలను పోల్చి చూసుకుంటే ఎంతో మార్పు కనిపిస్తోంది. పల్లె ప్రగతి స్ఫూర్తితో గ్రామీణ ప్రజల్లో సామాజిక మార్పు కనిపిస్తోంది. ఇదివరకటిలా గ్రామాలు, పట్టణాల్లో చెత్తా, చెదారాన్ని వీధులు, మురుగు కాలువల్లో పడేయడం వంటి చర్యలకు పాల్పడడం లేదు. ఇలాంటి అనేక మార్పులు తెచ్చిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను కొనసాగించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నెల 3 నుంచి 18 వరకు మరో విడుత నిర్వహిస్తోంది. ఈ 15 రోజులు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండి స్థానికంగా మిగిలి ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరిస్తారు.
ఈ విడుతలో ఏం చేస్తారు?
ఐదో విడుత పల్లెప్రగతిని విజయవంతంగా నిర్వహించేందుకు సర్పంచ్ అధ్యక్షతన ప్రతి గ్రామంలో కమిటీని ఏర్పాటు చేస్తారు. కమిటీలో వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, విద్యుత్ లైన్మన్, మిషన్ భగీరథ టెక్నీషియన్ సభ్యులుగా ఉంటారు. గ్రామ పంచాయతీలో పల్లెప్రగతి అభివృద్ధి నివేదికను ప్రజలందరికీ కనబడే విధంగా శాశ్వతంగా ఒక బ్లాక్ బోర్డుపై ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రతి నెలా ప్రగతి నివేదికను పొందుపర్చాల్సి ఉంటుంది.
మండలంలోని అన్ని గ్రామాలను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒకదానికి ఎంపీడీవో, మరోదానికి ఎంపీవో పర్యవేక్షకులుగా ఉంటారు. వీళ్లు తమ పరిధిలోని ఒక్కో గ్రామాన్ని మూడు సార్లు తప్పనిసరిగా సందర్శించాలి. ఎంపీపీలు, జడ్పీటీసీలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు.జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు కనీసం ఏడు రోజులు పల్లె నిద్ర చేయాలి. తెల్లవారు జాము 6 గంటలకు వార్డుల్లో పాదయాత్రలు నిర్వహించి పల్లె ప్రగతి పనులను పర్యవేక్షించాలి.
గ్రామ పంచాయతీ పరిధిలో 3 ఫేస్ కరెంట్ థర్డ్వైర్, వంగిన, తుప్పుబట్టిన స్తంభాలు, లూజ్ వైర్లను పవర్ డే రోజు తప్పనిసరిగా పరిష్కరించాలి.
గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, యువజన సంఘాలు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రజల భాగస్వామ్యం చేస్తూ శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించాలి.
అన్ని రోజులు ఇండ్ల నుంచి వచ్చే మురికి నీరు నిల్వ ఉండకుండా కుటుంబాలకు అవగాహన కల్పించి, ప్రతి ఇంటికీ మ్యాజిక్ ఇంకుడు గుంత కట్టుకునేందుకు ప్రోత్సహించాలి. ప్రతి రోజూ గ్రామంలోని రోడ్లు, మురుగు కాలువను శుభ్రం చేయించాలి. శిథిలాలు ఉంటే తొలగించాలి.
ఎవరి కార్యక్రమాలు వారికే..
17న కాలువలు, చెరువు గట్లు, నీటిపారుదల శాఖకు సంబంధించి ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటేందుకు ఈ శాఖ అధికారులు ప్రణాళికలు తయారు చేస్తారు. నదులు, ఉప నదులు, వాగులు, కాలువలు, ఒర్రెల, వంకలు మొదలైన వాటికి ఇరువైపులా గట్లపైనా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటారు. చెరువులు, రిజర్వాయర్ల శిఖం హద్దుల్లో మొక్కలు నాటి పరిరక్షణ చర్యలు చేపడతారు.
నేడు చామన్పల్లిలో ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి ఐదో విడుత కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ మండలం చామన్పల్లిలో ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తున్నారు. ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరీంనరగ్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్తోపాటు ఇతర శాఖల అధికారులు ఇక్కడ పాల్గొంటున్నారు. అలాగే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో అధికారులు విధిగా పాల్గొనాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశారు.