కలెక్టరేట్, మే 24: దళిత బంధు పథకం లబ్ధిదారులు కొత్త యూనిట్లను ఎంచుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో దళితబంధు యూనిట్ల పంపిణీపై మంగళవారం రాత్రి ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లబ్ధిదారులు కొన్ని రకాల యూనిట్లు మాత్రమే ఎంపిక చేసుకునేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారని, కొత్త యూనిట్లపై దృష్టిసారించడం లేదన్నారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి, కొత్త యూనిట్లపై దృష్టి సారించేలా ప్రోత్సహించాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో జాప్యాన్ని నివారించాలని, మంజూరు చేసిన యూనిట్ల కొనుగోలు కోసం నిధుల విడుదలలో శ్రద్ధ చూపాలన్నారు. గ్రూప్ యూనిట్ల ఎంపికపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 3 నుంచి చేపట్టే పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు, హాబిటేషన్లలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ఎకరం స్థలం గుర్తించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన తహసీల్దార్లు, సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డు, హాబిటేషన్లలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ఎకరం స్థలం గుర్తించాలన్నారు. జూన్ 3 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే పల్లె ప్రగతి పనుల కార్యాచరణను రూపొందించుకొని, ఆ దిశగా పనులు చేపట్టాలన్నారు. వైకుంఠధామం, డంప్ యార్డు, మెగా పల్లె ప్రకృతి వనాలపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. అనంతరం ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. రైస్ మిల్లుల్లో ధాన్యం దిగుమతిలో జాప్యం జరుగకుండా చూడాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్,జడ్పీ సీఈవో ప్రియాంక, డీఆర్డీవో శ్రీలతారెడ్డి, మెప్మా పీడీ రవీందర్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, క్లస్టర్ అధికారులు, తహసీల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.