ఇల్లందకుంట, మే 16: మండలంలో యాసంగి వరిధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 18 గ్రామాల్లో 9,540 ఎకరాల్లో రైతులు వరిసాగు చేయగా, దాదాపు 1.20 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యసాయాధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో డీసీఎంఎస్, ఇల్లందకుంట, మల్యాల, బోగంపాడు పీఏసీఎస్ ఆధ్వర్యంలో 14 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా, ఇప్పటికే 30,400 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు.
కేంద్రాల వారీగా..
డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఇల్లందకుంటలో 1500 క్వింటాళ్లు, చిన్నకోమటిపల్లిలో 800 క్వింటాళ్లు, వంతడుపులలో 900 క్వింటాళ్లు, మల్లన్నపల్లిలో 100 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. మల్యాల పీఏసీఎస్ పరిధిలోని వాగొడ్డురామన్నపల్లి, లక్ష్మాజీపల్లి గ్రామాల్లో ఆరు వేల క్వింటాళ్లు, బోగంపాడు పీఏసీఎస్ పరిధిలో సిరిసేడు, మర్రివాణిపల్లి గ్రామాల్లో రెండు వేల క్వింటాళ్లు సేకరించారు. ఇల్లందకుంట పీఏసీఎస్ పరిధిలోని కనగర్తి గ్రామంలో ఎనిమిది వేల క్వింటాళ్లు, శ్రీరాములపల్లిలో వెయ్యి క్వింటాళ్లు, సీతంపేటలో 5,600 క్వింటాళ్లు, బుజూనూర్లో 1400 క్వింటాళ్లు, రాచపల్లిలో 600క్వింటాళ్లు, గడ్డివాణిపల్లిలో 1300క్వింటాళ్లు, టేకుర్తిలో 1200క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు.
వెంటవెంటనే మిల్లులకు తరలింపు
మండలంలో ఏర్పాటు చేసిన 14 కొనుగోలు కేంద్రాల ద్వారా సోమవారం వరకు 30,400 క్వింటాళ్ల ధాన్యం సేకరించినట్లు అధికారులు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే లారీల్లో మిల్లులకు తరలిస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వర్షానికి కేంద్రాల్లో తడవకుండ ఏర్పాట్లు చేశారు.
రైతులు ఆందోళన చెందొద్దు
కొనుగోలు కేంద్రాల్లో పోసిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం. రైతులు ఆందోళన చెందొద్దు. నాలుగు అయిదు రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతమవుతుంది. రైతులు తూకం వేయడానికి సహకరించాలి. ఇప్పటికే విక్రయించిన వారు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ ఖాతా వివరాలతో సెంటర్లలో ఆన్లైన్ చేసుకున్నట్లయితే ఖాతాల్లో డబ్బులు జమవుతాయి.
-కందాల కొమురెల్లి, ఇల్లందకుంట పీఏసీఎస్ వైస్ చైర్మన్
సీఎం సార్కు రుణపడి ఉంటాం..
కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వడ్లు కొనుగోలు చేయబోమని చెప్పినా తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు వచ్చి ప్రభుత్వ మద్దతు ధరతో కొనడం గొప్ప విషయం. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని అధికారులు వెంటవెంటనే తూకం వేసి మిల్లులకు తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. యాసంగిలో రైతులు ఇబ్బందులు పడకుండా ఆదుకున్న సీఎం సారుకు రుణపడి ఉంటాం.
-మట్ట వాసుదేవారెడ్డి, రైతు, కనగర్తి