భక్తుల కొంగుబంగారం.. కోరిన కోర్కెలు తీర్చే వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం కొత్తరూపు సంతరించుకోబోతున్నది. ప్రస్తుతం రెండు గుంటల్లో ఉన్న గుడి స్థలం.. మరి కొద్దిరోజుల్లోనే ఎకరం విస్తీర్ణంలో సకల హంగులతో అలరారబోతున్నది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన ప్రభుత్వం విస్తరణకు వేగంగా అడుగులు వేస్తున్నది. భూములు కోల్పోతున్నవారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నది.
– వేములవాడ, మార్చి 22
వేములవాడ, మార్చి 22 : బద్దిపోచమ్మ ఆలయ విస్తరణకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్నను దర్శించుకున్న భక్తుల్లో 80శాతం మంది అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. రాజన్న సన్నిధికి రాష్ట్ర నలుమూలల నుంచి సోమ, శుక్రవారాల్లో 50 వేల నుంచి లక్షకుపైగా భక్తులు తరలివస్తుంటారు. అయితే ప్రస్తుతం బద్దిపోచమ్మ ఆలయం కేవలం రెండు గుంటల విస్తీర్ణంలోనే ఉండడం, ఇరుకు దారులు కావడంతో అమ్మవారికి బోనాల మొక్కులు తీర్చుకోవడంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన ప్రభుత్వం రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా అమ్మవారి గుడిని కూడా ఎకరం స్థలంలో విస్తరించాలని, అన్ని రకాల వసతులు కల్పించాలని గతంలోనే నిర్ణయించింది. ఈ క్రమంలో అధికారులు భూ సేకరణ చేశారు. ఆలయం చుట్టూ ఉన్న పట్టణవాసులతో పలు దపాలుగా చర్చలు జరిపిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు చివరకు వారిని మెప్పించి, ఒప్పించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు.
దాదాపు 40 ఏండ్ల క్రితం బద్దిపోచమ్మ ఆలయాన్ని అప్పటి అధికారులు విస్తరింపజేశారు. ప్రస్తుత పరిస్థితులలో పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రెండు గుంటల ఆలయాన్ని ఎకరానికి పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. అమ్మవారికి బోనాల మొక్కు, పట్నాలు, కల్లుసాక మొక్కులు అత్యంత ప్రీతిపాత్రం కాగా, గంటల తరబడి మహిళలు వేచి ఉండే విధానానికి స్వస్తి పలికేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
ఆలయ విస్తరణకోసం దాదాపు 40 గుంటలు సేకరిస్తుండగా, గజానికి రూ.30 వేల పరిహారంతో పాటు, దుకాణం కోల్పోయిన వారికి నామమాత్రపు అద్దెతో దుకాణం, ఒప్పంద పద్ధతిన ఆలయంలో ఉద్యోగం కూడా ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. మొదటి దఫాలో తొమ్మిది మంది నిర్వాసితులకు పరిహారం కింద 3.50 కోట్ల విలువైన చెక్కులను మంత్రి కేటీఆర్తో కలిసి ఎమ్మెల్యే రమేశ్బాబు ఇప్పటికే అందజేశారు. ఇటీవల మరో 17మందికి 7 కోట్ల విలువైన చెక్కులు అందజేశారు. ఇప్పటివరకు 26మంది నిర్వాసితులకు 10.50కోట్లు అందజేసి 30గుంటల స్థలాన్ని సేకరించారు. ఈ నెలాఖరులోగా మిగిలిన మరో 9 గుంటల స్థలాన్ని కూడా సేకరిస్తామని అధికారులు వెల్లడించారు.
రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది. బద్దిపోచమ్మ ఆలయం విస్తరణలో భూములు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేరుస్తాం. రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఎదురవుతున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ అభివృద్ధి వైపు నడుస్తున్నాం.
– చెన్నమనేని రమేశ్బాబు, ఎమ్మెల్యే వేములవాడ
ఆలయం విస్తరణ కోసం 39 గుంటల స్థలాన్ని భూసేకరిస్తున్నాం. ఇప్పటివరకు 26మంది నిర్వాసితులకు 10.50కోట్ల చెక్కులు అందజేశాం. మిగిలిన భూసేకరణ కూడా త్వరితగతిన పూర్తిచేస్తాం. ఎమ్మెల్యే రమేశ్బాబు సహకారంతో నిర్వాసితులు ముందుకు రావడంతో పనులు వేగవంతంగా నడుస్తున్నాయి.
– గంప సత్యనారాయణ, వీటీడీఏ ఎస్టేట్ అధికారి, వేములవాడ.