గొల్లపల్లి, జూలై 10: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణ రాష్ట్రం విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం గొల్లపల్లి మండలంలో పర్యటించారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకానితో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎంపీ నిధులు రూ.22 లక్షలతో కొనుగోలు చేసిన అంబులెన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అడిగిన వెంటనే అంబులెన్స్ కొనుగోలుకు తన ఎంపీ నిధుల నుంచి రూ. 22 లక్షలు కేటాయించిన వెంకటేశ్నేతకానిని అభినందించారు.
అంబులెన్స్ అందుబాటులోకి రావడంతో గొల్లపల్లి మండల ప్రజల ఇబ్బందులు తొలగిపోయాయని చెప్పారు. గొల్లపల్లిలో ఒకేరోజూ 5 మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిబద్ధతతోనే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పునరుద్ఘాటించారు. పైప్లైన్ పనులు పూర్తిచేసి రానున్న రెండేళ్లలో అన్ని గ్రామాలకు భగీరథ నీరందిస్తామని స్పష్టం చేశారు. ఊరూరా రోడ్లు, డ్రైనేజీలు, కుల సంఘాల భవనాల నిర్మాణానికి విరివిగా నిధులు ఇస్తున్నామన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని, ఫలితంగా మన రాష్ట్రంలో మరణాల రేటు గణనీయంగా తగ్గిందని తెలిపారు. కొవిడ్ సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కిందన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో 22మంది లబ్ధ్దిదారులకు రూ.6.40 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
గొల్లపల్లి విద్యుత్ ఉప కేంద్రం, పీహెచ్సీ, కస్తూర్బా పాఠశాల, జూనియర్ కళాశాలల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్గౌడ్, జడ్పీటీసీ జలంధర్, ఎఎంసీ లింగారెడ్డి, వైస్ ఎంపీపీ సత్తయ్య, సర్పంచ్ నిశాంత్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, పట్టణ అధ్యక్షుడు తిరుపతి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ కిష్టారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మాధవ రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గంగారెడ్డి, డీఎంఅండ్హెచ్వో శ్రీధర్, తహసీల్దార్ నవీన్ కుమార్, ప్రత్యేకాధికారి సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.