మేడిపల్లి, డిసెంబర్ 20: ‘అయ్యో నా కొడుకును కా పాడండి. దేశంకాని దేశం పోయిండు. కంపెనీలో జీతం ఇవ్వకపోతే బయటికి వచ్చిండు. అక్కడా ఏం పనిలేక.. ఇంటికి తిరిగిరాలేక.. కూడు, గూడు లేక నరకం చూస్తండు. ఆరోగ్యం పూ ర్తిగా క్షీణించి దవాఖాన్ల చేరిండు. నా కొడుక్కు ప్రాణభిక్ష పెట్టండి.. దుబాయ్ నుంచి రప్పించండి’ అంటూ బీమారం మండల కేంద్రానికి చెందిన జూపాక గంగమ్మ కన్నీరుమున్నీరవుతున్నది. మంగళవారం బీమారంలో తహసీల్దార్ యూసుబ్కు తనగోడు వెళ్లబోసుకున్నది. కొడుకును తిరిగి మా ఊరికి రప్పించాలని వినతి పత్రం ఇచ్చింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం..
మాకు దిక్కెవరు..
బీమారం మండల కేంద్రానికి చెందిన జూపాక కొండయ్య, గంగమ్మ దంపతుల కొడుకు గణేశ్(36) ఐదేండ్లుగా దుబాయ్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోవడంతో కంపెనీ నుంచి బయటికి వచ్చిండు. ఎంత తిరిగినా ఎక్కడా పనిలేకపోవడంతో తినడానికి అష్టకష్టాలు పడుతున్నడు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి స్పృహ తప్పి పడిపోతే స్థానికులు జబులలిలోని ఆస్టర్ హాస్పిటల్లో చేర్పించిన్రు. కోమా స్టేజీలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గ తంలోనే గణేశ్ భార్య లావణ్య, తండ్రి కొండయ్య అనారోగ్యంతో చనిపోయారు. ఉన్న ఒక్క మనుమడు (నితీష్ (8) గణేశ్ కొడుకు)ను తానే చూసుకుంటున్నానని, కొడుకు లేకపోతే దిక్కెవరని కన్నీటి పర్యంతమైంది. తన కొడుకును స్వగ్రామానికి రప్పించాలని వేడుకుంటూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసింది. ఆమె వెంట గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, నాయకులు శివకుమార్, మర్రిపెల్లి శ్రీనివాస్, బొమ్మెన ప్రశాంత్, పల్లి ప్రవీణ్ ఉన్నారు.