పెగడపల్లి : దోమల కుంటలో మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు చూపుతున్న సీఐ రమణమూరి, ఎస్ఐ శ్వేత, పోలీస్ సిబ్బంది
పెగడపల్లి, డిసెంబర్ 20: దోమలకుంటలో ఆదివారం మహిళ హత్య కేసులో నిందితులు భర్త,మామను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మల్యాల సీఐ రమణమూర్తి, పెగడపల్లి ఎస్ఐ కొక్కుల శ్వేత విలేకరులతో వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నక్క రమేశ్, గంగవ్వ భార్యాభర్తలు. వీరికి ఒక కొడుకు, కూతురు. అయితే కుటుంబ కలహా లు, భూముల విషయంలో ఇంట్లో కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం రమేశ్ తన కొడుకు జలందర్ను హత్య చేసి జైలుకు వెళ్లొచ్చాడు. అదే గ్రామం లో భార్య గంగవ్వకు దూరంగా ఉంటున్నాడు. గ్రామంలోని వ్యవసాయ భూమిని చేజిక్కించుకోవాలంటే భార్య గంగవ్వ, కూతురు స్నేహ అడ్డు తొలగించుకోవాలని తన తండ్రి రాయమల్లుతో రమేశ్ కుట్ర పన్నాడు.
ఈ క్రమంలో ఈనెల 18న గ్రామ సమీపంలోని పొలంలో నాటు వేస్తున్న తన భార్య గంగవ్వ వద్దకు వచ్చిన రమేశ్ ఆమెతో గొడవకు దిగాడు. కత్తి తో పొడిచి చంపాడు. అడ్డువచ్చిన కూతురు స్నేహపై కూడా దాడికి పాల్పడగా ఆమె తప్పించుకొని పారిపోయిందని సీఐ, ఎస్ఐ వివరించారు. రమేశ్ తండ్రి రాయమల్లు కూడా పొ లం వద్దకు వచ్చి హత్యకు ప్రోత్సహించినట్లు తెలిపారు. హత్య అనంతరం నిందితులు పారిపోగా కూతురు స్నేహ ఫిర్యాదు మేరకు తండ్రి, కొడుకుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా,సోమవారం రాత్రి నిందితులు డబ్బు, బట్టలు తీసుకెళ్లేందుకు ఇంటికి రాగా, పక్కా సమాచారం మేరకు వారిని పట్టుకున్నట్లు వివరించారు. కాగా, హత్య జరిగిన 24 గంటల్లో నిందితులను పట్టుకున్న మల్యాల సీఐ రమణమూర్తి, పెగడపల్లి ఎస్ఐ శ్వేత, పోలీస్ సిబ్బంది శ్రీనివాస్రెడ్డి, ఎల్లయ్య, ఉదయ్, సాగర్, రాజేందర్, రమాదేవిని ఎస్సీ సింధూశర్మ, డీఎస్పీ ప్రకాశ్ అభినందించారు.