కోర్టుచౌరస్తా, డిసెంబర్ 20: సులభంగా డబ్బు సంపాదించాలని సహచరులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.200 జరిమానా విధిస్తూ కరీంనగర్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎం అరుణ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎర్రంగుట్టకు చెందిన సర్దార్ రంజిత్ సింగ్ ఓరంజిత్ సింగ్ అలియాస్ బడాసింగ్ (50) సులభంగా డబ్బు సంపాదించాలని దోపిడీ, దొంగతనాలను ఎంచుకున్నాడు. ఒకో ప్రాంతంలో కొత్త వ్యక్తులను కలుపుకొని దోపిడీలు చేస్తుండేవాడు.
ఇందులో భాగంగా 2021 డిసెంబర్ 14న రాత్రి ఒంటి గంట ప్రాంతంలో అల్గునూర్లోని రాజరాజేశ్వర సిమెంట్ స్టీల్ దుకాణంలో దొంగతనం చేసేందుకు సహచరుడు ప్రతాప్సింగ్ తో కలిసి వచ్చి రాడుతో షట్టర్ తెరిచాడు. రంజిత్సింగ్ షెటర్లోనికి వెళ్లి కౌంటర్లో నుంచి రూ.1500 తీసుకొని బయటికి వస్తుండగా, ఆ సమయంలో మూత్ర విసర్జనకు బయటికి వచ్చిన అదే గ్రామానికి చెందిన కొమ్ము శ్రీనివాస్ అనుమానం వచ్చి రంజిత్ సింగ్ను పట్టుకున్నాడు. ఈ క్రమంలో రంజిత్ సింగ్ శ్రీనివాస్పై రాడ్తో దాడి చేసినా శ్రీనివాస్ అతన్ని వదల్లేదు. ఈ గొడవ విని చుట్టుపకల వారు రావడంతో బయట కాపలాగా ఉన్న ప్రతాప్సింగ్ పారిపోగా, రంజిత్సింగ్ పట్టుబడ్డాడు. కొమ్ము శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎల్ఎండీ ఎస్ఐ ప్రమోద్రెడ్డి కేసు నమోదు చేయగా సీఐ కే శశిధర్రెడ్డి దర్యాప్తు జరిపారు.
మొదట ఈ కేసు కరీంనగర్ స్పెషల్ ఎక్సైజ్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. రంజిత్ సింగ్ పై నేర నిరూపణ జరిగింది. ఈ క్రమంలో అతని నేర ప్రవృత్తి గతంలో అతనికి పడిన శిక్షలను పరిగణలోకి తీసుకున్న మెజిస్ట్రేట్ శ్రీనిజ శిక్ష పెంపుదల కోసం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టుకు కేసు బదలాయించారు. పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి అరుణ.. రంజిత్సింగ్కు జైలుశిక్ష, జరిమానా విధించారు. కింది కోర్టులో ప్రాసిక్యూషన్ పక్షాన ఏపీపీ వీరస్వామి, పైన కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గౌరు రాజిరెడ్డి వాదించారు. ప్రతాప్సింగ్ పరారీలో ఉన్నాడు.