తప్పుచేశాం..? ఎవరూ చూడలేదు.. ఊరు విడిచి వెళ్లిపోదామని అనుకుంటున్నారా..? ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాం.. సిబ్బంది గుర్తించలేదు.. మాకేం అవుతుందని లైట్ తీసుకుంటున్నారా..? ఇక తప్పించుకోలేరు. ఇలాంటి నేరస్తులు, ఉల్లంఘనులు పనిపట్టేందుకు.. శాంతి భద్రతలు పరిరక్షించేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. కరీంనగరాన్ని ‘స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ’గా మార్చే వ్యూహంలో భాగంగా నగరంలో ఆధునిక ప్రమాణాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మిస్తున్నది. నగర శివారులోని మానేరు నది సమీపంలో రూ.54కోట్ల వ్యయంతో తీర్చిదిద్దుతుండగా, అప్పటిదాకా సెంటర్ను నగర బల్దియా కార్యాలయంలో తాత్కాలికంగా యంత్రాగం ఏర్పాటు చేసింది. నగరంలోని ప్రతి సీసీ కెమెరాను ఈ సెంటర్కు అనుసంధానిస్తుండగా, ఇక చీమ చిటుక్కుమన్నా తెలిసిపోనున్నది. వీటితోపాటే ట్రాఫిక్ సిగ్నల్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, వైఫై టవర్స్ ఇలా అన్నివసతులు కల్పిస్తుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– కరీంనగర్ కార్పొరేషన్, డిసెంబర్ 20
కరీంనగర్ను సేఫ్ సిటీగా మార్చే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందుకుసాగుతున్నది. శాంతిభద్రతల పరిరక్షణ, ఆకతాయిల పట్టడడమే లక్ష్యంగా నగరంపై నిఘా పెడుతున్నది. సిటీ రోజురోజుకూ విస్తరిస్తుండడం, అనేక అభివృద్ధి పనులు జరుగుతుండడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్, నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా తెలిసేలా మానేరు తీరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మిస్తున్నారు. స్మార్ట్సిటీలో భాగంగా 54 కోట్ల వ్యయంతో చకచకా పనులు చేయడంతోపాటు సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, వైఫై టవర్స్ను ఏర్పాటు చేస్తున్నారు.
తాత్కాలికంగా బల్దియా కార్యాలయంలో ఏర్పాటు..
కమాండ్ కంట్రోల్ సెంటర్ను తాత్కాలికంతా నగరపాలక సంస్థ కార్యాలయంలోని మూడో అంతస్తుల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని సీసీ కెమెరాలను సెంటర్కు అనుసంధానం చేస్తున్నారు. వీటితో పాటుగా నగరంలో చౌరస్తాల సుందరీకరణ పనులు వేగంగా సాగుతుండగా, ఈ పనులతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్, ఫొటో క్యాప్చర్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి నగరాన్ని పటిష్టమైన నిఘా పెట్టేందుకు ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడనుంది.
ప్రజలకు సేవలు.. తప్పు చేస్తే జరిమానాలు
నగరంలో ఏర్పాటు చేయనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీస్ శాఖకు సంబంధించిన సేవలతో పాటుగా నగర వాసులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసే సౌకర్యాలు కల్పిస్తున్నారు. నగరంలోని ప్రతి ప్రాంతాన్ని పరిశీలించేందుకు 110 ప్రాంతాల్లో 335 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు 24 చౌరస్తాల్లో 85 ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని పూర్తిగా ఆయా ఏరియాల్లో ఉన్న ట్రాఫిక్ను అనుసరించి అటోమెటిక్ సిగ్నల్ ఉండే విధంగా అమర్చుతున్నారు. అలాగే 174 ఆటోమెటిక్ నంబర్ ప్లేట్స్ రికగ్నైజేషన్ కెమెరాలు, 85 వెహికల్ డిటెక్షన్ కెమెరాలు, ట్రాఫిక్ నిబంధనలను గుర్తించేందుకు మరో 85 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినా.. రెడ్ సిగ్నల్, ట్రాఫిక్ లైన్స్ జంపింగ్లు చేసినా వీటి ద్వారా జరిమానాలు పడే అవకాశం ఉంటుంది. ఇక ప్రజల సౌకర్యార్థం 40 ప్రాంతాల్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే మరో 10 ప్రాంతాల్లో వాతావరణ వివరాలు తెలిపే సెన్సార్లు, 15 ప్రాంతాల్లో 150 వైఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేయబోతున్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేకంగా చర్యలు
నగరంలో పారిశుధ్య పనుల కోసం వినియోగిస్తున్న వాహనాలను ప్రయాణాలను సెంటర్ ద్వారా పర్యవేక్షించనున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానంలో నగరంలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరిస్తుంటారు. అయితే రోజూ వీధుల్లో తిరుగుతున్నారా..? చెత్త సేకరిస్తున్నారా..? అనే విషయాలను తెలుసుకోనున్నారు. ఈ మేరకు ప్రతి వాహనానికి ట్రాకింగ్ సిస్టమ్ను అమర్చనున్నారు. నిర్దేశించిన ప్రాంతాలకు వాహనాలు వెళ్తున్నాయా.. లేదా అని తెలుసుకొని చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.