ఇల్లందకుంట, డిసెంబర్ 15: ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక లాభాలను పొందవచ్చని జిల్లా ఉద్యానవన శాఖాధికారి బండారి శ్రీనివాస్రావు పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఏవో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆయిల్ పామ్ మొక్కలను నాటిన నాలుగు సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు రైతులకు నిరంతర ఆదాయం వస్తుందన్నారు. దళారుల ప్రమేయం లేకుండా రాయితీపై మొక్కలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.
మొక్కల పెంపకం పై క్షేత్రసిబ్బంది ద్వారా సాంకేతిక సలహాలందిస్తామని వివరించారు. ఆయిల్పామ్లో అంతర పంటలను సాగు చేసుకోవడం వల్ల అదనపు ఆదాయం వస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 6,000 దరఖాస్తులు వచ్చాయని. ఇందులో 1200 ఎకరాలకు రైతుల నుంచి డీడీలను తీసుకున్నట్లు పేర్కొన్నారు. జనవరిలో రైతులకు ఆయిల్ పామ్ మొక్కలను అందజేస్తామన్నారు. ఇక్కడ ఏవో గుర్రం రజిత, ఉద్యానవన శాఖ హెచ్వో మంజువాణి, ఏఈవో తిరుపతి, రైతులు ఉన్నారు.