గంగాధర, డిసెంబర్ 15: మధురానగర్ చౌరస్తా, గంగాధర రైల్వే బ్రిడ్జి వద్ద చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదేశించారు. గురువారం మధురానగర్ చౌరస్తాలో, రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మధురానగర్ చౌరస్తా నుంచి గంగాధర మండల కేంద్రానికి వెళ్లే దారి దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పా రు.
ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లి మధురానగర్ చౌరస్తా 0/0 కిలోమీటర్ నుంచి 0/4 కిలో మీటరు దాకా, అలాగే రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డు నిర్మాణానికి 2.33 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ప్రయాణికులు కష్టాలు తీరుతాయన్నారు.
కొందరు అవగాహన లేని వ్యక్తులకు రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ బండి సంజయ్ నిధులు మంజూరు చేయించారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు నమ్మవద్దని సూచించారు. గత ఎమ్మెల్యే అసమర్థత వల్లే మధురానగర్ వద్ద రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా మిగిలిందన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిని కాబట్టి రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ నాయకులు వేముల అంజి, సుంకె అనిల్, పెంచాల చందు తదితరులు పాల్గొన్నారు