శంకరపట్నం, డిసెంబర్ 9: మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. ఎంపీపీ ఉమ్మెంతల సరోజన అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు సభ్యులు పలు సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. అర్హులైన పలువురికి ఆసరా పింఛన్లు రావడం లేదని.. ఎందుకు మిస్సయ్యాయో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల ఖాళీలు, ఆయాల పోస్టుల వివరాలు ప్రభుత్వానికి పంపాలని, వృద్ధాప్యం, రోగులు, లేవలేని స్థితిలో ఉన్న లబ్ధిదారులకు బియ్యం పంపిణీకి ప్రత్యామ్నాయం చూడాలని ఆముదాలపల్లి సర్పంచ్ మానస అధికారులను కోరారు. అలాగే చిన్న గ్రామ పంచాయతీలకు బిల్లులు త్వరగా చెల్లించి ఇబ్బందులు తీర్చాలని కాచాపూర్ సర్పంచ్ కోండ్ర రాజయ్య కోరారు.
జనరల్ బాడీ సమావేశానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ తిరుపతయ్య డిమాండ్ చేశారు. విద్యాశాఖ నిధుల వినియోగంపై ఆముదాలపల్లి సర్పంచ్ బత్తుల మానస ఎంఈవోను వివరాలు అడుగగా, ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై వైస్ ఎంపీపీ పులికోట రమేశ్తో పాటు పలు గ్రామాల సర్పంచులు కోండ్ర రాజయ్య, దాసారపు భద్రయ్య, మొకిరాల కిషన్రావు, మానస, ఎంపీటీసీ గాండ్ల తిరుపతయ్య తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈవో అధికారిననే విషయం మరిచి పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఇది ఇలా ఉండగా మన ఊరు-మన బడి పనుల బిల్లులను ప్రభుత్వం నూరు శాతం త్వరితగతిన చెల్లిస్తున్నట్లు పీఆర్ ఇన్చార్జి ఏఈ రవి ప్రసాద్ స్పష్టం చేశారు. రాజాపూర్ ఉప సర్పంచ్ కుర్రె ఓదెలు గ్రామానికి చెందిన అభివృద్ధి పనుల నోట్ ఫైళ్లపై సంతకాలు చేయకుండా సతాయిస్తున్నాడని సర్పంచ్ పిన్రెడ్డి వసంత వాపోయారు. దీంతో ఏడాదికిపైగా చేసిన పనుల బిల్లులు నిలిచిపోయాయయని, అప్పులు తెచ్చి పనులు చేస్తే వడ్డీ పెరిగిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పలువురు సర్పంచులు ఆమెకు మద్దతుగా ఇబ్బందులు పెడుతున్న ఉప సర్పంచులను గుర్తించి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సస్పెండ్ చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి ఎంపీడీవో బషీరొద్దీన్ సమాధానం చెప్పారు. సమావేశంలో ఇన్చార్జి ఎంపీడీవో తోపాటు ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ త్రినాథ్, పలు శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.