జగిత్యాల/జగిత్యాల రూరల్, డిసెంబర్ 6: ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల పర్యటనకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. మోతెలో బహిరంగ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని, 2లక్షల మందికిపైగా ప్రజలు, కార్యకర్తలు తరలివస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్కు ప్రారంభోత్సవం, మెడికల్ కాలేజీకి శంకుస్థాపన, తదితర అభివృద్ధి కార్యక్రమాల కోసం బుధవారం జగిత్యాలకు సీఎం వస్తున్న నేపథ్యంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, జడ్పీ చైర్పర్సన్ వసంతతో కలిసి ఆయాచోట్ల ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. జగిత్యాల కొత్త జిల్లాలో అద్భుతంగా సకల వసతులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంకాబోతున్నదని చెప్పారు. టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదిగిందని, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్ను బలోపేతం చేసేందుకు జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నామని చెప్పారు. లక్షలాది మంది క్యాడర్ ఉన్న పార్టీకి సమావేశాల కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. వీటన్నింటితో పాటు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, ఈ కార్యక్రమాలన్నింటికీ కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.