కార్పొరేషన్, డిసెంబర్ 6: నగరంలో నిర్మిస్తున్న రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ఆర్అండ్బీ అతిథి గృహం నిర్మాణ పనులను మంగళవారం ఆయన టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మేయర్ వై సునీల్రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, రూ.12 కోట్లతో నగర నడిబొడ్డున పాత అతిథి గృహం స్థానంలోనే ఎకరం స్థలంలో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ భవనంలో సీఎం బస కోసం మొదటి అంతస్తులో సగం మేర కేటాయిస్తున్నామని, కింది భాగంలో సాధారణ అతిథి గదులు, మంత్రులు, ఇతర ప్రముఖులు వచ్చినప్పుడు బస చేసేందుకు డూప్లెక్స్ పద్ధతిలో మూడు అతిథి గృహాలు ఉన్నాయన్నారు. అతిథి గృహం ముందు భాగంలో పచ్చదనం, లోపల ఫర్నిచర్, ఇతర హంగులు కల్పించే పనులు సాగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈఈ సాంబశివరావు, ఏఈలు లక్ష్మణ్రావు, రాజశేఖర్ పాల్గొన్నారు.