కొత్తపల్లి, డిసెంబర్ 6: తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నదని, కోట్లాది నిధులతో అనేక వసతులు కల్పిస్తున్నదని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కొత్తపల్లి విత్తనశుద్ధి కర్మాగారం సమీపంలో డీఎంఈ రమేశ్రెడ్డితో కలిసి మెడికల్ కళాశాల స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య తెలంగాణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే కరీంనగర్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసిందని చెప్పారు. మెడికల్ కాలేజీకి కావాల్సిన 500 పడకల దవాఖాన ఇప్పటికే కరీంనగర్లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను తాత్కాలిక భవనాల్లో తరగతులు ప్రారంభిస్తామని, తొలుత 100 సీట్లను భర్తీ చేసి బోధన చేస్తామని వివరించారు.
ఈ క్రమంలో మెడికల్ కాలేజీని త్వరితగతిన నిర్మించి అందులోకి షిఫ్ట్ చేస్తామన్నారు. కాలేజీ కోసం ప్రభుత్వం కొత్తపల్లి విత్తనశుద్ధి కర్మాగారం సమీపంలో 25 ఎకరాల విశాలమైన స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు. కరీంనగర్లో ఇప్పటికే రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండడంతో ప్రభుత్వ మెడికల్ కళాశాల రాదేమోనంటూ సందేహపడ్డారని, కానీ వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ కరీంనగర్కూ మెడికల్ కాలేజీని మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ఇక్కడ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, కొత్తపల్లి తహసీల్దార్ చిల్ల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలుద్దీన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు ఉన్నారు.