కలెక్టరేట్, నవంబర్ 28:రాష్ట్ర వ్యాప్తంగా ఐసీడీఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న గ్రేడ్-2 సూపర్వైజర్ల పోస్టులు తాజాగా భర్తీ అయ్యాయి. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులు సోమవారం విధుల్లో చేరారు. ఈ పోస్టుల భర్తీ కోసం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లలో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నోటిఫికేషన్ వెలువరించింది. గతేడాది నవంబర్లో ప్రకటన విడుదల చేసి, జనవరిలో రాతపరీక్ష నిర్వహించి, అర్హుల జాబితా విడుదల చేసింది. అయితే, ఎంపిక విధానంపై కొంతమంది కోర్టుకు వెళ్లడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ చొరవతో న్యాయ వివాదం పరిష్కారం కావడంతో, భర్తీ ప్రక్రియలో నెలకొన్న అడ్డంకులు తొలగిపోయాయి.
పెద్దపల్లి జిల్లా
జిల్లాలో అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్-2 పోస్టులు 14 కాగా, అందులో తొమ్మిది ఖాళీలు ఉన్నాయి. తాజాగా, వీటన్నింటినీ ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ పోస్టుల్లో జిల్లాకు చెందిన వారే ఉన్నారు. అంతే కాకుండా జిల్లా నుంచి మరో ఇద్దరు ఇతర జిల్లాల్లో సూపర్వైజర్లుగా ఎంపికయ్యారు. పెద్దపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టుకు ఇద్దరు, మంథనికి నలుగురు, రామగుండానికి ముగ్గురు సూపర్వైజర్లుగా బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా నియామకమైన వారికి జిల్లా సంక్షేమ అధికారి రవూఫ్ఖాన్ నియామక పత్రాలను అందజేశారు.
ఉమ్మడి జిల్లాలో 42 మంది నియామకం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ పరిధిలో 61 పోస్టులు ఉండగా, ఇందులో 42 ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి ప్రభుత్వం గతేడాది నవంబర్లో ప్రకటన విడుదల చేసి, జనవరిలో రాతపరీక్ష నిర్వహించింది. దీనికి అంగన్వాడీ టీచర్లు పెద్ద ఎత్తున హాజరు కాగా, అంగన్వాడీ కార్యకర్తలు తమ సత్తా చాటి అంగన్వాడీ సూపర్వైజర్లుగా అవకాశాన్ని పొందారు. వారందరికీ ప్రభుత్వం వివిధ జిల్లాల్లోని ఐసీడీఎస్ ప్రాజెక్టులను కేటాయించగా వారంతా సోమవారం సూపర్వైజర్లుగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఉమ్మడి రాష్ట్రంలో వీరి బేసిక్ వేతనం కేవలం 14వేలు మాత్రమే ఉండగా, స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 26,410కి పెంచింది.
జగిత్యాల జిల్లా
జిల్లాలో అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్-2 పోస్టులు మొత్తం 19 ఉండగా, అందులో 15 ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని తాజాగా భర్తీ చేసినట్లు జిల్లా సంక్షేమాధికారి బోనగిరి నరేశ్ తెలిపారు. జగిత్యాల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో బీ భాగ్యలక్ష్మి, జే లావణ్య, ఎస్ స్వరూపారాణి, జే రాధ, మెట్పల్లి ప్రాజెక్టు పరిధిలో సీహెచ్ ప్రతిభ, హైమదీ బేగం, శంకరమ్మ, ఏ భారతీ, ధర్మపురి పరిధిలోపీ లత, శైలజ, ఏ నీలిమ, మల్యాల ప్రాజెక్టు పరిధిలో ఏ జ్యోతి, జీ ఉమ, డీ మహేశ్వరి, టీ సుభద్రను నియమించారు.
ఇది గొప్ప అవకాశం
అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న వారందరికీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నది. సూపర్వైజర్ పోస్టుల భర్తీకి సైతం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చాలా మంది అంగన్వాడీ టీచర్లు పరీక్షల్లో తమ సత్తా చాటి సూపర్వైజర్లు అయ్యారు. ఇది ప్రభుత్వం వారందరికీ ఇచ్చిన గొప్ప అవకాశం.
– రౌఫ్ఖాన్, పెద్దపల్లి జిల్లా సంక్షేమ అధికారి (పెద్దపల్లి)
ఈ ఉద్యోగం కోసమే ఎదురు చూస్తున్నా
నేను డబుల్ పీజీ చేసి అంగన్వాడీ కార్యకర్తగా చేరా. ఎన్నటికైనా ఐసీడీఎస్ సూపర్వైజర్ను కావాలని కోరుకున్నా. రెండోసారి సూపర్వైజర్ పరీక్ష రాశాను. ఈ పరీక్షలో నాకు అవకాశం వచ్చింది. హుజూరాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టులో టీచర్గా పనిచేసిన నేను పెద్దపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టులో సూపర్వైజర్గా పనిచేసే అవకాశం వచ్చింది. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-నూకల సావిత్రి, పెద్దపల్లి ఐసీడీఎస్ సూపర్వైజర్ (హుజూరాబాద్)
రాజన్న సిరిసిల్ల జిల్లా
జిల్లాలోని ఐసీడీఎస్ పరిధిలో మొత్తం సూపర్వైజర్ గ్రేడ్-2 పోస్టులు 12 కాగా, 7 ఖాళీలు ఏర్పడ్డాయి. వీటి భర్తీకి నూతనంగా ఎంపికైన సూపర్వైజర్లకు నియామక పత్రాలు అందజేసినట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో వెల్లడించారు. రుద్రంగికి లింగంపల్లి మమత, కోనరావుపేటకు పథకం గంగలక్ష్మి, జిల్లెల్లకు తన్నీరు అంజలి, పెద్దలింగాపూర్కు సూర్యకళ, లింగన్నపేటకు రేణుక, సుభాష్నగర్కు చంద్రకళ, వీర్నపల్లికి సంతోష్కుమారిని నియమించినట్లు చెప్పారు.
కరీంనగర్ జిల్లా
జిల్లాలో మొత్తం నాలుగు ప్రాజెక్టులు ఉండగా, 777 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గ్రేడ్-1లో 15, గ్రేడ్-2లో 16 చొప్పున మొత్తం 31 మంది సూపర్వైజర్లు వీటిని పర్యవేక్షించాల్సి ఉంది. అయితే, గ్రేడ్-1లో 13 మంది, గ్రేడ్-2లో 5 చొప్పున 18 మంది మాత్రమే ఉన్నారు. మిగతా 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కరీంనగర్ అర్బన్ పరిధిలో గ్రేడ్ 1 పోస్టులు రెండు, గ్రేడ్ 2 పోస్టులు అర్బన్లో 1, రూరల్లో 4, గంగాధర పరిధిలో 2, హుజూరాబాద్ ప్రాజెక్టు పరిధిలో 4 ఖాళీగా ఉన్నాయి. కాగా, తాజాగా గ్రేడ్-2లో ఖాళీగా ఉన్న 11 పోస్టులను భర్తీ చేశారు. వీరికి శనివారం నియామక పత్రాలు అందజేయగా, సోమవారం జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో రిపోర్టు చేసి, విధుల్లో చేరినట్లు ఆశాఖ అధికారి కే సబితాకుమారి తెలిపారు.