ధర్మారం, నవంబర్22: సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 3లక్షల సాయం ఇవ్వాలని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారని, త్వరలో నిరుపేదల కల నెరవేరబోతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఈ పథకం విధివిధానాలు త్వరలోనే ఖరారై, నిరుపేదలను గ్రామసభల ద్వారా ఎంపిక చేసే ప్రక్రియ మొదలవుతుందన్నారు. దళితుల జీవితాలను బాగు చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు తెచ్చారని గుర్తు చేశారు. ఈ పథకం అమలు నిరంతర ప్రక్రియ అని, దశల వారీగా ఎస్సీలకు సాయం అందుతుందని చెప్పారు. ధర్మారం మండలంలో మంగళవారం మంత్రి విస్తృతంగా పర్యటించారు. బొమ్మారెడ్డిపల్లిలో డీఎంఎఫ్టీ నిధులు కోటీ40 లక్షలతో నిర్మించే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో మున్నూరు కాపు, రెడ్డి సామాజిక భవన నిర్మాణాలను ప్రారంభించారు.
అనంతరం సాయంపేటలో మన ఊరు- మన బడి కార్యక్రమం కింద 46 లక్షల నిధులతో నూతన పాఠశాల గదులు, ఇతర నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఈశ్వర్ బొట్లవనపర్తిలో 52 మంది మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డును ప్రారంభించి, అదే కాలనీలో మరో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో గ్రామాల్లో సమగ్రాభివృద్ధి జరిగిందన్నారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సాయం అందించి అండగా ఉంటున్నదన్నారు. పేద విద్యార్థులందరికీ విద్య అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం మన ఊరు -మనబడి కార్యక్రమం ద్వారా నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పిస్తున్నదని మంత్రి గుర్తు చేశారు. కాగా సాయంపేటలో కొత్తగా పాఠశాల గదుల నిర్మాణానికి 3.90 లక్షల విరాళాలు అందించి స్థలం కొనుగోలు చేసి ఇచ్చిన దాతలు గ్రామ ఉప సర్పంచ్ బద్దం శ్యామల- తిరుమల్ రెడ్డి, జైళ్ల శాఖ ఉద్యోగి బద్దం గోపాల్రెడ్డి, బొలిశెట్టి రాజేశంను ఆయన అభినందించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పూస్కూరు పద్మజ -జితేందర్రావు, ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.