సిరిసిల్ల రూరల్, నవంబర్ 9: సిరిసిల్లలో పవర్ లూంల అప్గ్రేడేషన్ పకడ్బందీగా పూర్తి చేయాలని, నాణ్యమైన వస్త్రాల తయారీకి తగిన ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర పవర్లూం, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్పార్క్లోని పరిపాలన భవనంలో మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్ పీఎస్ శ్రీనివాస్, చేనేత, జౌళిశాఖ, టెక్స్టైల్ పార్క్ యాజమానులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.
సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ పెంచేలా, నాణ్యమైన వస్త్రాల తయారీకి పవర్లూంల అప్గ్రెడేషన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇందుకు వేగవంతంగా అప్గ్రెడేషన్ పూర్తి చేయాలని సూచించారు. మార్కెట్ కు అనుగుణంగా వస్ర్తాల తయారీ జరగాలని, కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పించాలన్నారు. వర్క్ టూ ఓనర్ స్కీంలో లబ్ధిదారుల ఎంపిక, విధి విధానాలను రూపొందించాలన్నారు. టెక్స్టైల్పార్క్, అప్పారెల్ పార్క్లో కార్మికుల సమస్యలు, ఉపాధి కల్పనపై సమీక్షించామన్నారు. సమావేశంలో డీడీ అశోక్రావు, ఎడీ సాగర్, టెస్కో రతన్, చారి, టెక్స్టైల్ పార్క్ యాజమానులు, అధికారులు ఉన్నారు.