తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సోమవారం రాత్రి మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ మినీ స్టేడియంలో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవుడిని పూలతో పూజిస్తే.. ఆ పూలనే పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని, మహిళలందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
మెట్పల్లి, సెప్టెంబర్ 26: “మహిళలకు అంత్యంత సంతోషాన్నిచ్చేది బతుకమ్మ పండుగ. ఏ పండుగకైనా దేవుడిని పూలతో పూజిస్తాం. కానీ, పూలను పూజించే పండుగ ఇది. మన సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ” అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సోమవారం మెట్పల్లిలోని అంబేద్కర్ మినీ స్టేడియంలో జరిగిన బతుకమ్మ వేడుకలకు ఆమె హాజరై మాట్లాడారు.
బతుకమ్మకు వాడే పూలు కూడా పెద్ద ఖరీదైన కావని, ఎక్కడికో వెళ్లి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, మన ఊర్లో, మన చేన్లలోనే తంగేడు, బంతి, గునుగుపూలు దొరుకుతాయన్నారు. మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించామన్నారు. తాను 8, 9వ తరగతి చదువుకునే రోజుల్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు తమ ఊరికి వెళ్లిపోయేవారమని, తొమ్మిది రోజులు అక్కడే ఉండేవారమని తన చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయని, బతుకమ్మ ఘాట్ల వద్ద బతుకమ్మల నిమజ్జనం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. విద్యార్థినుల నుంచి మహిళల వరకు అందరూ పండుగను గర్వంగా సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను ఎమ్మెల్సీ కవిత రాష్ట్రంలోనే కాదు విదేశాల్లోని తెలుగు ప్రజలు సైతం ఘనంగా జరుపుకొనేలా పరిచయం చేశారని గుర్తు చేశారు.
పేదింటి మహిళల ముఖాల్లో ఆనందం చూడాలని బతుకమ్మ చీరెలను ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ కానుకగా అందిస్తున్నారన్నారు. కొందరు పగటి బిచ్చగాళ్లలా వస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నారని, అలాంటి వారి మాటలను పట్టించుకోవద్దని కోరారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ మన బతుకమ్మ పండుగను ఖండాంతరాలు దాటి అనేక దేశాల్లో జరుపుకొంటున్నారంటే ఆ ఘనత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకే దక్కుతుందని తెలిపారు.