ఏ ధీమాలేని అభాగ్యులకు ‘ఆసరా’తో కొండంత అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కారు, మరో లక్షకుపైగా కుటుంబాలకు భరోసా ఇవ్వబోతున్నది. పింఛన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించి ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీ మేరకు.. ఉమ్మడి జిల్లాలో కొత్తగా 1,08,318 మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేసింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల కానుకగా ఆగస్టు 15 నుంచే పంపిణీకి శ్రీకారం చుట్టగా, నయా పింఛన్లతో ఏటా ప్రభుత్వంపై అదనంగా 262 కోట్ల భారం పడనున్నది. మొత్తంగా పింఛన్లు పొందే వారి సంఖ్య 5.29,669కి చేరనున్నది. నాడు తెలంగాణ రాక ముందు పూర్వపు కరీంనగర్ జిల్లాలో ప్రతి నెలా 9.10 కోట్లు వెచ్చిస్తే.. నేడు ప్రతి నెలా 106.78 కోట్లను ప్రభుత్వం వెచ్చించనున్నది. నిజానికి కరోనా ద్వారా ఏర్పడిన ఆర్థిక విపత్తు ఇంకా కొనసాగుతున్నా.. సర్కారు మాత్రం సంక్షేమం విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మరోసారి నిరూపించుకున్నది. ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా మానవీయత చూపుతున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు చెబుతున్నారు.
కరీంనగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రం వస్తే అత్యంత తెలంగాణ ధనిక రాష్ట్రంగా గుర్తించబడుతుందని, బడుగు బలహీనవర్గాల బతుకులకు భరోసా లభిస్తుందని ఉద్యమ సమయంలోనే చెప్పిన ఆనాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి ఆచరణలోనూ అదే పంథాను అనుసరిస్తూ వస్తున్నారు. ఓవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే.. మరోవైపు సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తున్నారు. ప్రతి పథకంలోనూ మానవీయత చూపుతూ.. ఎందరికో కొండత అండగా నిలుస్తున్నారు. ఆసరా పింఛన్లతో లక్షలాది కుటుంబాల్లో ఇప్పటికే వెలుగులు నింపుతున్న ఆయన, వజ్రోత్సవాల కానుక అందించారు. ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించి.. ఆగస్టు 15 నుంచే నయా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొత్తగా మంజూరైన 1.08 లక్షల పింఛన్లు మంజూరు కాగా, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లాలో పింఛన్ల వివరాలు
పాతవి 4,21,351
కొత్తగా మంజూరు 1,08,318
మొత్తం 5,29,669
సీఎం కేసీఆర్ సారే మాకు పెద్దదిక్కు
నాకు 63 ఏండ్లున్నయ్. శాతగాకుంట అయింది. ఇంతకుముందు 65 ఏండ్లుంటనే పింఛన ఇచ్చెది. అందుకే నాకు ఇయ్యలె. ఇప్పుడు కేసీఆర్ సారు 57 ఏండ్లు నిండినోళ్లకు పింఛన్ ఇస్తున్నడు. నేను దరఖాస్తు వెట్టుకున్న. నాకు కొత్త పింఛన్ మంజూరైందని చెప్పి ఇగో ఈ కార్డు, పేపర్ ఇచ్చిన్రు. నెలనెలా 2016 పింఛన్ పైసల్ బ్యాంకుల పడుతయట. నాలాంటి ముసలోళ్లకు సీఎం కేసీఆర్ సారే దిక్కయితండు. మా అవసరాలకు ఎవరి మీద ఆశ పడకుండ చేసిండు. సారుకు రుణపడి ఉంట.
నాడు పట్టని సమైక్య ప్రభుత్వాలు
నిజానికి నాటి సమైక్య పాలకులు పింఛన్ల మొత్తం పెంపు విషయంలో నిర్లక్ష్యంచూపారు. చంద్రబాబు హయాంలో అన్ని రకాల పింఛన్ల కింద కేవలం నెలకు 75 మాత్రమే ఇచ్చేవారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం పింఛన్ల మొత్తాన్ని కంటితుడుపుగా పెంచిందే తప్పా భరోసా ఇవ్వలేదు. నెలవారీగా దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ను 500, వితంతువులు, చేనేత, గీత, వృద్ధులకు 200 చేసినా అవి ఏమూలకూ సరిపోయేవి కాదు. నెలనెలా మందులు కూడా రాకపోయేవి. పింఛన్ పెంచాలని ఎన్నో ఉద్యమాలు జరిగినా పాలకులు పట్టించుకోలేదు. ప్రభుత్వాలూ స్పందించలేదు.
నేడు తెలంగాణ సర్కారు కరుణ
బతుకు భారమైన అభాగ్యులకు తెలంగా సర్కారు ఆది నుంచీ అండగా నిలుస్తున్నది. ఆసరా పథకం కింద పింఛన్లు ఇస్తూ భరోసానిస్తున్నది. అంతేకాదు, ఈ విషయంలో ఇచ్చిన మాటను అడుగడుగునా నిలబెట్టుకుంటూ వస్తున్నది. స్వరాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచుతామని టీఆర్ఎస్ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృద్ధులు, వితంతువుల పింఛన్లను 200 నుంచి వెయ్యికి, దివ్యాంగుల పింఛన్లను 500 నుంచి 1500లకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెంచారు. అప్పట్లో అదో సంచలనం. అలాగే ఇప్పుడిస్తున్న పింఛన్ల మొత్తాన్ని మరోసారి పెంచుతామని 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ మరోసారి హామీ ఇచ్చారు. ఆ మేరకు వృద్ధులు, వితంతువుల పింఛన్లను వెయ్యి నుంచి 2,016, దివ్యాంగులకు 1,500 నుంచి 3,016లకు పెంచారు. రెండో సారి పెరిగిన పింఛన్లను 2019 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తెచ్చారు.
మరోసారి మాటనిలుపుకున్న ముఖ్యమంత్రి
ఆసరా పింఛన్ల కింద ఇచ్చే మొత్తంతో సబ్బండ వర్గాలు సంతోషంతో ఉండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సాహోపేత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. 2020 మార్చి 8న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా.. వృద్ధులకు ఇచ్చే పింఛన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకుకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. మధ్యలో కరోనా విజృంభణతో అన్ని రాష్ర్టాలతోపాటు తెలంగాణ రాష్ట్రంపైనా ఆర్థిక ప్రభావం పడింది. అయినా ఏ మాత్రం పట్టించుకోకుండా.. ఎలాంటి అంతరాయం లేకుండా సంక్షేమాన్ని కొనసాగించారు. ఇచ్చిన హామీ మేరకు 75వ స్వాతంత్య సంబురాల సందర్భంగా కొత్త పింఛన్లు ఇస్తామని ముందుగా ప్రకటించినట్టుగానే ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నోళ్లందరికీ పింఛన్లు మంజూరు చేశారు.
ఏటా 262 కోట్ల అదనపు భారం
నాడు తెలంగాణ రాక ముందు పూర్వ కరీంనగర్ జిల్లాలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతవులు, చేనేత, గీత కార్మికులకు కలిపి మొత్తం 3,56,900 మందికి ప్రతినెలా 9 కోట్లా 10 లక్షల 36 వేల 900 ఇచ్చేవారు. కానీ, స్వరాష్ట్రంలో ఆసరా పథకం కింద ప్రస్తుతం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 4,21,351 మందికి ప్రతినెలా 84.94 కోట్ల వరకు అందిస్తున్నారు. ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ల వయసును 57ఏండ్లకు తగ్గించడంతో కొత్తగా మరో 1,08,318 పింఛన్లు మంజూరు చేశారు. వీటికి సంబంధించి ప్రతినెలా 21.81 కోట్లు ఇవ్వనున్నారు. అంటే కొత్త పింఛన్ల ద్వారా ఏడాదికి సుమారు 262 కోట్ల అదనపు భారం పడనున్నది. కాగా పాత, కొత్త పింఛన్లు కలిపి చూస్తే ప్రతినెలా 106.78 కోట్లను ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి కరోనా ప్రభావం ఇంకా ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతూనే ఉన్నది. అయినా ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి అమలు చేస్తుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ సాహసోపేత నిర్ణయం లక్షలాది మంది బడుగు జీవుల జీవితాలకు పెద్ద భరోసాను కల్పించనున్నది.
నా భర్త చనిపోయిండు. ఇద్దరు చిన్న పిల్లలను కూలీ నాలీ చేసుకుంట సాదుతున్న. ఇల్లు గడవడమే కష్టంగ ఉంటంది. ఆర్థికంగ ఇబ్బందులు పడుతున్న. ఈ టైంల నాకు పింఛన్ మంజూరైంది. ఆర్థికంగా భ రోసా దక్కింది. ఇంట్లో అవసరాలకు పనికొస్తయ్.. పింఛన్ మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంట.
– బొనగాని సౌజన్న,అందుగులపల్లి, పెద్దపల్లి
గోలిమందులకు పనికస్తయ్..
నాకు 58 ఏండ్లుంటయ్.. ఇంతకు ముందు 65 ఏండ్లకు పింఛన్ ఇచ్చెటోళ్లు.. అప్పటి దాకా ఉండెటోళ్లెవరో.. పోయెటోళ్లెవరో తెల్వదు. ఉన్నప్పుడు అందిన సాయమే పనకిస్తది. 57 ఏండ్లకు పింఛన్ ఇస్తే మంచిగుండు అనుకున్నం. అనుకున్నట్టే సీఎం కేసీఆర్ సారు మాకు పింఛన్ మంజూరు చేసి మంచి పనిజేసిండు. కొన్నేండ్లన్న ఆసరా అయితయ్. పింఛన్ పైసలతో మా కష్టాలు పోతయ్. గోలిమందులకు ఇవి పనికస్తయ్. వృద్ధాప్యంలో పింఛన్ మంజూరు చేసిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటం.
– జిట్టవేని లక్ష్మీరాజం, ఐతుపల్లి, పెగడపల్లి మండలం, జగిత్యాల