రక్తదానాల్లోనూ జాతీయ స్ఫూర్తిని రగిలించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాల్లో పెద్ద సంఖ్యలో దేశభక్తులు భాగస్వాములై రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. గంగాధర పీహెచ్సీలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో మెగా రక్తదాన శిబిరాన్ని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, మానకొండూర్లో సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ప్రారంభించి, రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
కరీంనగర్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అనేక మంది ముందుకు వచ్చి రక్తదానం చేసి, జాతీయ స్ఫూర్తిని చాటారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో సేవ్ ది లైఫ్ ఫౌండేషన్, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించి మెగా రక్తదాన శిబిరాన్ని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ ప్రారంభించారు. ఇక్కడ అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్, డీఏవో వాసిరెడ్డి శ్రీధర్, మైనార్టీ సంక్షేమ అధికారి మధుసూదన్, సహకార అధికారి శ్రీమాల రక్తదానం చేశారు. ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలోనూ రక్తదాన శిబిరం నిర్వహించారు. గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించి, రక్తదానం చేసిన యువకులను అభినందించారు. మానకొండూర్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు ప్రారంభించారు. హుజూరాబాద్లో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు.