హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లికి చెందిన బోడ కొమురయ్య – మధునమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. కూలీ పనే జీవనాధారం. వీరికి కొడుకు, కూతురు. కొన్నేండ్ల క్రితం అప్పు చేసి కూతురుకు పెండ్లి చేశారు. కొడుకు సురేశ్కూ వివాహం జరిపించారు. అయితే తన అక్క పెండ్లి కోసం తెచ్చిన అప్పులు తీర్చేందుకు సురేశ్ విద్యుత్ మరమ్మతులు చేసే కాంట్రాక్టర్ వద్ద కూలి పనికి చేరాడు. నెలంతా కష్టపడినా పెద్దగా ఫలితం ఉండేది కాదు.
ఏదైనా బిజినెస్ చేద్దామంటే ఆర్థిక స్థోమత లేక ముందడుగు వేయలేకపోయాడు. ఏడాది క్రితం సీఎం కేసీఆర్ తెచ్చిన దళిత బంధు వారికి వరంలా మారింది. తల్లి, తన భార్య పేరిట వచ్చిన రూ.20లక్షలతో టిప్పర్ కొన్నాడు. గ్రామంలోనే ఓ క్రషర్లో టిప్పర్ను కిరాయికి పెట్టి కంకర తరలిస్తున్నాడు. రోజుకు రూ.2వేల దాకా సంపాదిస్తున్నాడు. దళిత బంధుతో కష్టాల నుంచి తేరుకున్నామని, చాలా సంతోషంగా ఉందని సురేశ్ చెబుతున్నాడు. – హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 17