కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 14: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పండుగను తలపించేలా నిర్వహించుకోవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కరీంనగర్ జిల్లాలో..
కరీంనగర్లోని పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర వేడులకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. తర్వాత ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. అనంతరం వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందజేసి, వివిధ శాఖలకు చెందిన స్టాల్స్ను పరిశీలిస్తారు. తర్వాత సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలతో అధికార యంత్రాంగం స్వాతంత్య్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే వేడుకలకు ఐటీ, మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఎస్పీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 10:30 గంటలకు మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను తన ప్రసంగం ద్వారా వివరిస్తారు. తర్వాత ప్రభుత్వ పథకాలను తెలిపే శకటాలను ప్రదర్శిస్తారు. తర్వాత విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలుంటాయి. అనంతరం లబ్ధిదారులకు ఆస్తులను పంపిణీ చేస్తారు. స్టాళ్ల సందర్శనతో కార్యక్రమాలు ముగుస్తాయి. వేడుకల్లో భాగంగా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో పోలీసులు శనివారం రిహార్సల్స్ నిర్వహించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో..
పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆదేశాల మేరకు వేడుకల నిర్వహణకు పెద్దపల్లి పట్టణంలోని ఐటీఐ మైదానంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలీసుల గౌరవం వందనంతో పాటు వేడుకలకు వచ్చేవారిని ఆకర్షించేలా రంగు రంగుల ముగ్గులతో అందంగా అలంకరించారు. వేడుకల ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హాజరై ఉదయం 10:30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. వేడుకలకు జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేతకాని, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, ఎలగందుల రమణతో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. వేడుకల కోసం వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మైదాన ప్రాంగణాన్ని పెద్దపల్లి తహసీల్దార్ సుధాకర్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా మొరం, మట్టి పోసి చదును చేశారు.
జగిత్యాల జిల్లాలో..
జగిత్యాల జిల్లా కేంద్రంలోని చారిత్రక ఖిల్లాను ముస్తాబు చేశారు. జెండా ఆవిష్కరించే గద్దెకు రంగులు వేసి సిద్ధం చేశారు. మున్సిపల్ సిబ్బంది పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు, గడ్డిని తొలగించి గ్రౌండ్ను చదును చేసి స్టేజీ, బారికేడ్లు నిర్మించారు. వీఐపీలు, ఆహ్వానితులు, అధికారులు, ప్రజలు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ 10:30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, సందేశాన్ని ఇస్తారు. తర్వాత స్వాతంత్య్ర సమరయోధులను సత్కరిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ప్రశంసాపత్రాలను ప్రదానం చేస్తారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, లబ్ధిదారులకు ఆస్తులను పంపిణీ చేయనున్నారు. ఖిల్లాలో ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి శనివారం పరిశీలించారు.