జగిత్యాల కలెక్టరేట్, ఆగస్టు 11 : సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ క్రైమ్స్ రేటు సైతం పెరుగుతున్నదని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని జగిత్యాల కలెక్టర్ జీ రవి సూచించారు. తెలంగాణ పోలీస్లోని వుమెన్ సేఫ్టీ వింగ్, పాఠశాల విద్యాశాఖ, యంగిస్తాన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాలకు ఇద్దరు చొప్పున వంద మంది విద్యార్థులకు సైబర్ నేరాలపై అందించిన శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా జగిత్యాల సుమంగళి గార్డెన్స్లో జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోముందు వరుసలో ఉన్నారన్నారు. ముఖ్యంగా మహిళలు, చిల్డ్రన్స్ పై జరిగే నేరాలను నిరోధించేందుకు షీ టీమ్స్, వుమెన్ సేఫ్టీ వింగ్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు. సైబర్ కాంగ్రెస్లో శిక్షణ తీసుకున్న విద్యార్థులు తోటి విద్యార్థులకు, చుట్టుపక్కల వారికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మరింత మంది సైబర్ అంబాసిడర్లను తయారు చేయాలన్నారు. ఎస్పీ సింధూశర్మ మాట్లాడుతూ సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి చైతన్య పర్చడమే సైబర్ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలో 50 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి పాఠశాలకు ఇద్దరు చొప్పున వంద మంది విద్యార్థులకు సైబర్ భద్రతపై శిక్షణ అందించామన్నారు.
శిక్షణ పొందిన సైబర్ అంబాసిడర్లు తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజానికి అవగాహన కల్పించాలన్నారు. ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాలన్నారు. ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపద్యంలో మోసాలపై ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలన్నారు. సైబర్ అంబాసిడర్స్, మెంటర్స్గా ఉన్న ఉపాధ్యాయులకు కలెక్టర్, ఎస్పీలు సర్టిఫికెట్లు అందజేశారు. షీ టీం, సైబర్ క్రైం టీం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఆర్. ప్రకాశ్, రవీంద్రారెడ్డి, డీసీపీవో హరీశ్, సఖీ సెంటర్ ఇన్చార్జి మనీల, ఎస్బీ, ఐటీ కోర్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సరిలాల్, జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్, ఆర్ఐ వామనమూర్తి, ఎస్ఐలు, షీ టీం, సైబర్ క్రైం టీం సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.