జమ్మికుంట రూరల్, జూలై 8: జమ్మికుంట మండల పరిధిలోని వావిలాలకు చెందిన కలకోట నర్సయ్య-ఓదమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. కూలీనాలీ చేసుకుంటూ ముగ్గురు కూతుళ్ల పెండ్లిళ్లు చేశారు. రెండో కూతురు మంజులను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం టెలికేట్ గ్రామానికి చెందిన కుమ్మరి కాశీరామ్కు ఇచ్చి వివాహం చేశారు. మంజులకు ఇద్దరు కూతుళ్లు. వైష్ణవి, వర్ష. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన కాశీరాం ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. ఎన్నేళ్లయినా అతడు తిరిగి రాక, ఎక్కడున్నాడో సమాచారం దొరకక మనోవేదన అనుభవించింది. ఇంటి కిరాయి కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులను ఎదురొన్నది. చేసేదేంలేక పిల్లలను తీసుకొని 2008లో పుట్టింటికి వచ్చింది. 2009లో తండ్రి నర్సయ్య మృతి చెందాడు.
కుటుంబ పోషణ కోసం మంజుల టైలరింగ్ చేస్తూ, బొంతలను సైతం కుట్టి పిల్లలను పాఠశాలకు పంపింది. ఆదాయం పెంచుకునేందుకు వరంగల్ జిల్లా కేంద్రంలోని ములుగు రోడ్లో పేపర్ ప్లేట్ల తయారీ కంపెనీలో పనిచేసింది. ప్లేట్ల తయారీ నేర్చుకొన్నది. ఐదేళ్లపాటు దినసరి కూలీగా రోజుకు రూ.300 సంపాదించింది. సొంతంగా పేపర్ ప్లేట్లు తయారు చేయాలనే సంకల్పంతో అప్పులు చేసి వావిలాలలో చిన్న పేపర్ ప్లేట్ మిషన్ తీసుకువచ్చి ప్లేట్ల తయారీని ప్రారంభించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని అమలు చేయగా తనకు అనుభవం ఉన్న ప్లేట్ల తయారీ యంత్రం, రవాణా కోసం టాటా ఏస్ కోసం అర్జీ చేసుకున్నది. గత ఏప్రిల్లో మంజులకు దళితబంధు యూనిట్ను అధికారులు మంజూరుచేశారు. వచ్చిన డబ్బులతో రెండు కొత్త యంత్రాలను కొనుగోలు చేసి, పేపర్ ప్లేట్ల తయారీని ప్రారంభించింది. గతంలో రోజుకు నాలుగువేల ప్లేట్లు తయారు చేసే ఆమె, నేడు 12 వేల ప్లేట్లలను తయారు చేస్తూ, ఆదాయాన్ని పెంచుకున్నది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు ఆ మహిళకు ఆసరాగా నిలిచింది.
కేసీఆర్ సార్కు ఎప్పటికీ రుణపడి ఉంటా
కష్టపడి నా పిల్లలను చదివించుకుంటున్న. ఇల్లు గడవాలంటే బాగా ఇబ్బందయితుండె. రోజూ కూలీ పనికి వెళ్లిన. కష్టపడి పేపర్ ప్లేట్ల తయారీ నేర్చుకున్న. అప్పులు చేసి ఒక మిషన్ తెచ్చుకుని పేపర్ ప్లేట్ల తయారీ మొదలుబెట్టిన. సీఎం సార్ దళితబంధుతో ఆదుకున్నడు. రెండు కొత్త మిషన్లు తెచ్చుకున్న. మునుపటి కంటె ఉత్పత్తి పెరిగింది. దళితబంధు మా కుటుంబానికి అండగా నిలిచింది. మా కుటుంబాన్ని ఆదునుకున్న సీఎం సార్కు ఎప్పటికీ రుణపడి ఉంట.
– కుమ్మరి మంజుల, లబ్ధిదారు, వావిలాల(జమ్మికుంట)