రాజన్న సిరిసిల్ల, జూలై 8 (నమస్తే తెలంగాణ): సకాలంలో పాఠ్యపుస్తకాలు… ప్రైవేట్లో చదువు ‘కొనా’లంటే తలకు మించిన భారమవుతున్నది. ఫీజులు, లెక్కకు మించిన పాఠ్యపుస్తకాల బరువు మోయలేక విద్యార్థులు కుంగిపోతున్నారు. సర్కారు బడిలో ప్రభుత్వం విద్యతో పాటు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, సన్నబియ్యంతో కడుపు నిండా భోజనం పెడుతున్నది. బాలికలకు కాస్మోటిక్స్, పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. దీంతో సర్కారు బడులన్నీ విద్యార్థులతో కిక్కిరిసి పోతున్నాయి. సమైక్య పాలనలో బడులు ప్రారంభమై నెలలు గడిచినా పాఠ్యపుస్తకాలు రాని దుస్థితి ఉండేది. తెలంగాణ ప్రభు త్వం బడుల ప్రారంభానికి మూడు నెలల ముం దే పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు చేరవేస్తూ వస్తున్నది. ఈ సంవత్సరం ఆంగ్లమాధ్యమం అమలు చేసినందున కాస్త ఆలస్యమైనా పూర్తి స్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకున్నది. జిల్లాకు 3,10,090 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటివరకు 2,03,810 వచ్చాయి. మిగతా 1,04,280 పుస్తకాలు త్వరలో రానున్నాయి. వీటిలో 1,20,000 పుస్తకాలను అధికారులు 480 బడులకు చేరవేశారు. వచ్చిన పు స్తకాలను వెంటవెంట విద్యార్థుల చేతిలో పెట్టేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది.
‘మన ఊరు మన బడి’కి విశేష స్పందన
రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చాలన్న లక్ష్యంతో ‘మన ఊరు మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా బడులను ఆధునిక హంగులతో కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఆంగ్లబోధన అందిస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. సొంతూరుకు కొంత మేలు చేయాలన్న ఉద్దేశంతో మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చూపిన చొరవకు తమ వంతు సహకారమందించేందుకు దాతలు సైతం ముందుకొస్తున్నారు. దీంతో ప్రైవేట్ను వీడి సర్కారు బడులకు విద్యార్థులు పరుగులు పెడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో అన్ని స్కూళ్లలో అడ్మిషన్లు ఫుల్ అయ్యాయి. దాదాపు 6వేల మంది విద్యార్థులు ప్రైవేట్కు టాటా చెప్పి సర్కారు బడిలో చేరారు. అడ్మిషన్ల కోసం ఉన్నతాధికారులతో పైరవీలు చేస్తే గాని సర్కారులో సీటు దొరకని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం విద్య పట్ల తీసుకుంటున్న చర్యలతో పిల్లల తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పెరుగుతున్న విద్యార్థులు
సమైక్య సర్కారు బడులను నిర్లక్ష్యం చేసింది. దీంతో విద్యార్థుల సంఖ్య తగ్గి చాలావరకు మూసే సే పరిస్థితి వచ్చింది. బ డులు ప్రారంభమై నెలలు గడిచినా పాఠ్యపుస్తకాలు అందలేదు. తెలంగాణ సర్కారు తీసుకున్న ‘మన ఊరు మనబడి’ కార్యక్రమం స్ఫూర్తిదాయకం. బడులన్నీ కార్పొరేట్కు దీటుగా తయారవుతున్నాయి. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున పాఠ్యపుస్తకాలు అందించే చర్యలు తీసుకోవాలి.
– శ్రీనివాసరావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం
తెలంగాణ ప్రభుత్వం ఏటా మూడు నెలల ముందే పుస్తకాలను సరఫరా చేసేది. ఈసారి ద్వి భాషా ముద్రణతో ఆలస్యమైంది. మన జిల్లాకు 3,10,090 బుక్స్ అవసరం కాగా, 2,03,810 వచ్చాయి. మిగతా 1,04,280 పుస్తకాలను త్వరలో ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాకు వచ్చిన పాఠ్యపుస్తకాలను వెంటనే మండలాలకు చేరుస్తున్నాం. వారంలోగా విద్యార్థులందరికీ అందజేస్తాం.
– రాధాకిషన్, రాజన్న సిరిసిల్ల డీఈవో