నిన్నటి దాకా ఒక మామూలు వ్యవసాయాధారిత గ్రామంగా ఉన్న మెట్ల చిట్టాపూర్ త్వరలోనే అంతర్జాతీయ యవనికపై మెరువనున్నది. భారీ ఇథనాల్, సిలికా, ఆర్గానిక్ ఫర్టిలైజర్ పరిశ్రమల ఏర్పాటుతో విశ్వ విపణిలోకి అడుగుపెట్టబోతున్నది. ఈ ప్రాంత ప్రజల స్థితిగతులను మార్చివేసి, యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న రాష్ట్ర సర్కారు సంకల్పంతో ఫ్యాక్టరీల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గ్రామంలోని 95 ఎకరాల్లో నెలకొల్పేందుకు మంత్రి కేటీఆర్ కృషితో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భువి, ధాత్రి బయో సొల్యూషన్స్ ముందుకురాగా, ఇటీవలే ప్రజల సమక్షంలోనే సర్కారు- కంపెనీల మధ్య ఎంఓయూ కుదిరింది. పరిశ్రమలు ఏర్పాటైతే 2500 మంది స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు దక్కనుండడం, స్థలం చదును పనులు మొదలుకావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
జగిత్యాల, జూలై 1 (నమస్తే తెలంగాణ): మెట్ల చిట్టాపూర్. జగిత్యాల జిల్లాలో ఒక మామూలు వ్యవసాయాధారిత గ్రామం. వ్యవసాయం తప్ప ఇతర వృత్తులు, వ్యాపకాలు ఇక్కడి ప్రజలకు తెలియదు. అంతా లెక్కిస్తే 1500 మంది జనాభా ఉండే ఈ ఊరు, రాష్ట్ర ప్రభుత్వ చొరవతో త్వరలోనే విశ్వ విపణిలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నది. సహజంగా భౌగోళికాంశాలు, వాతావరణ, శీతోష్ణస్థితులకు అనుగుణంగా ప్రజల వృత్తులు, వ్యాపారాలు, సంస్కృతి రూపుదిద్దుకుంటాయన్నది జగమెరిగిన సత్యం. మెట్పల్లి మండలంలోని మెట్ల చిట్టాపూర్ గ్రామంలోనూ ప్రజలు అక్కడి శీతోష్ణస్థితి, వాతావరణం, నీటి వసతుల నేపథ్యంలో వరి పంటను అధికంగా సాగు చేస్తున్నారు. దీంతోపాటు పక్కనే ఉన్న హస కొత్తూరు, ధాంరాజ్పల్లి, ఇతర గ్రామాల ప్రజలు సైతం వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. అయితే, ఇక్కడి ప్రజల స్థితిగతులను మార్చివేసి, రైతులకు మేలు చేకూర్చడంతోపాటు, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో మెట్లచిట్టాపూర్ సమీపంలో రూ.1200 కోట్ల పెట్టుబడితో, ఇథనాల్, సిలికా తయారీ ఫ్యాక్టరీలు ఏర్పాటు కాబోతున్నాయి. అత్యంత అరుదైన ఇథనాల్, సిలికా, ఆర్గానిక్ ఫర్టిలైజర్లను తయారు చేసే ఫ్యాక్టరీల స్థాపన కోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భువి, ధాత్రి బయో సొల్యూషన్స్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ కమిషనర్ కృష్ణభాస్కర్, ధాత్రి, భువి కంపెనీల ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. మెట్పల్లి పట్టణంలో ప్రజల సమక్షంలోనే ఎంఓయూలను మార్చుకోవడం విశేషం. చిట్టాపూర్లో 95 ఎకరాలలో ఏర్పాటుకాబోతున్న ఈ ఫ్యాక్టరీల వల్ల దాదాపు 2500 మంది స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి దొరకనున్నది.
భువి బయో కెమికల్స్ ఆధ్వర్యంలో ఇథనాల్ పరిశ్రమను రెండు దశల్లో ఏర్పాటు చేసేందుకు సంస్థ నిర్ణయించింది. రూ.1040 కోట్ల వ్యయంతో మొదటి దశలో రోజుకు లక్ష లీటర్ల ఇథనాల్ ఉత్పాదక సామర్థ్యంతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు. ఏడాది తర్వాత రెండో దశలో మరో లక్ష లీటర్ల ఉత్పత్తి సామర్థ్యానికి పెంచనున్నారు. పరిశ్రమ రెండేళ్ల తర్వాత రోజుకు రెండు లక్షల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సంతరించుకోనుంది. ఇందుకు రోజుకు వెయ్యి టన్నుల వరిగడ్డిని వినియోగించనున్నారు. మొదటి ఏడాది లక్ష లీటర్ల ఉత్పత్తికి లక్ష ఎకరాల్లో వరిగడ్డిని, పూర్తి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత రెండు లక్షల ఎకరాల్లో వరిగడ్డి ఇథనాల్ తయారీకి అవసరం కానున్నది. జగిత్యాల జిల్లాలో వానకాలంలో 2 లక్షల ఎకరాలు, యాసంగిలో 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. ఇథనాల్ పరిశ్రమ పూర్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని సంతరించుకుంటే జిల్లాలో పంట కోసిన తర్వాత మిగిలిన వరిగడ్డి మొత్తం ఇథనాల్ తయారీకే వినియోగించే అవకాశాలున్నాయి. ఇథనాల్ తయారీ తర్వాత అదే వ్యర్థాల నుంచి సిలికా, ఆర్గానిక్ ఫర్టిలైజర్ను తయారు చేయనున్నారు. బహుళ ఉత్పత్తులు కలిగిన ఈ పరిశ్రమ కోసం ప్రభుత్వం 80 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
ధాత్రి బయో సొల్యూషన్స్ ఆధ్వర్యంలోసిలికా పరిశ్రమ
ధాత్రి బయో సొల్యూషన్ ఆధ్వర్యంలో సిలికా ఉత్పత్తి పరిశ్రమను స్థాపించేందుకు అంగీకారం కుదిరింది. ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల స్థలంలో రూ.160 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న పరిశ్రమలో దాదాపు 300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వరిపొట్టును ముడిపదార్థంగా వినియోగించి సిలికాను తయారు చేస్తారు. దీనిని ప్రధానంగా టైర్లు, పెయింట్స్, రబ్బరు తయారీలో వినియోగిస్తుంటారు. సిలికాతో పాటు, బయోగ్యాస్ను సైతం ఇక్కడ తయారు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
పరిశ్రమలతో బహుళ ప్రయోజనాలు
భువి, ధాత్రి బయో సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న పరిశ్రమలతో జిల్లా ప్రజలకు బహుళ ప్రయోజనాలు దక్కనున్నాయి. మెట్పల్లి ప్రాంతంతో పాటు, జిల్లా పరిధిలోని రైతులకు, వ్యవసాయాధారిత రంగాల్లో ఉపాధి పొందుతున్న వారికి, అర్హత కలిగిన యువతకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఇప్పటి వరకు గడ్డిని కాల్చడం వల్ల ఏర్పడిన వాతావరణ కాలుష్యానికి చెక్పడుతుంది. వరిగడ్డి నుంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ తయారవుతుండడంతో భూసారం పెరుగుతుంది. ఈ మేరకు భువి, ధాత్రి కంపెనీలు, ఇక్కడి రైతులకు వరికోతతో పాటు, పంటల యాజమాన్య రక్షణపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వరిగడ్డే ముడి పదార్థంగా.. పరిశ్రమలు
వరిగడ్డే ముడి పదార్థంగా పరిశ్రమలు పనిచేయనున్నాయి. రాష్ట్రంలో వరి అత్యధికంగా సాగవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో వరి సేద్యం అత్యధికంగా జరుగుతోంది. వరి కోతలు ముగిసిన తర్వాత గడ్డిని భూమిలో కలియదున్నడం లేదా, పొలంలోనే కాల్చివేయడం ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ. కాల్చడం వల్ల భూసారం దెబ్బతింటుందని, వాతావరణం కలుషితమ వుతుందని రైతులకు ఎంత అవగాహన కల్పించినా మార్పురావడం లేదు. ఈ క్రమంలోనే కోతల తర్వాత మిగిలిన గడ్డి నుంచి ఇథనాల్, సిలికా, ఆర్గానిక్ ఫర్టిలైజర్ను తయారు చేసేందుకు భువి, ధాత్రి బయో సొల్యూషన్ కంపెనీలు ముందుకు వచ్చాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ర్టాలు తమ రాష్ర్టాల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని ఆహ్వానించినా, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో వాటిని కాదని తెలంగాణలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, ఆయన తనయుడు డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల కృషితో రెండు పరిశ్రమలను మెట్లచిట్టాపూర్ శివారులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం, కంపెనీలు పరస్పరం ఒక అంగీకారానికి వచ్చాయి. వరి కోసిన తర్వాత వరిగడ్డిని ముడిపదార్థంగా వినియోగించి ఇథనాల్ను తయారు చేయనున్నారు. ఇథనాల్తో పాటు, సిలికా, ఆర్గానిక్ ఫర్టిలైజర్ను ఉత్పత్తి చేయబోతున్నారు. ఇథనాల్ను మద్యం, స్పిరిట్, మందుల తయారీలో వినియోగించే విషయం అందరికీ తెలిసిందే. ఇక సిలికాను పెయింట్స్, టైర్స్, రబ్బర్, టూత్ పేస్టుల తయారీలో వాడుతారు. ఇథనాల్, స్పిరిట్ తయారీ తర్వాత అదే వ్యర్థం నుంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ను తయారు చేయనున్నారు. వరిగడ్డిలో నైట్రోజన్, పాస్ఫరస్, పొటాషియం పుష్కలంగా ఉండడంతో వీటి ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేయనున్నారు.
జిల్లాకే మణిహారం.. మెట్ల చిట్టాపూర్ పరిశ్రమ
మెట్లచిట్టాపూర్లో ఏర్పాటు కానున్న ఇథనాల్, సిలికా పరిశ్రమలు కోరుట్ల నియోజకవర్గానికే కాదు, జగిత్యాల జిల్లాకే మణిహారాలుగా మారబోతున్నాయి. వ్యవసాయం తప్ప ఇతర వృత్తులు తెలియని ఇక్కడి ప్రజల మేలు కోసం మంత్రి కేటీఆర్ చొరవ చూపి, భువి, ధాత్రి లాంటి ప్రఖ్యాత కంపెనీలను ఒప్పించి రప్పించడం గొప్ప విషయం. పరిశ్రమలు ఏర్పాటై, పూర్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని సంతరించుకుంటే ప్రపంచ మార్కెట్లోకి మెట్లచిట్టాపూర్ పేరు ప్రవేశిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడి యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. వ్యవసాయరంగంపై పరోక్షంగా ఆధారపడిన వారికి సైతం మేలు జరుగుతుంది. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు ధన్యావాదాలు.
– కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుట్ల ఎమ్మెల్యే
గల్ఫ్ వలసలు తగ్గుతాయి
మా గ్రామ శివారులో పెద్ద మొత్తంలో ప్రభుత్వ స్థలం ఉంది. రెండు ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం 197 ఎకరాలు కేటాయించింది. ప్లాంట్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, టీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇప్పటికే స్థలం చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి. ప్లాంట్ల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి దొరుతుంది. గల్ఫ్ వలసలు భారీగా తగ్గుతాయి. ఇతర పరిశ్రమల ఏర్పాటుకు సైతం మా వద్ద అవసరమైన స్థలం ఉంది.
– బద్దం శేఖర్రెడ్డి, సర్పంచ్, మెట్లచిట్టాపూర్
రైతులకు మరింత లాభం
ఈ ప్రాంతంలో ఎస్సారెస్పీ కాకతీయ కాలువతో పాటు వరదకాలువ కూడా ఉండడంతో సాగునీటికి ఇక్కట్లు లేవు. ఇక్కడి రైతులు ప్రధానంగా వరి, మక్క ఎక్కువగా సాగు చేస్తారు. ఇథనాల్ తయారీకి ఈ రెండు పంటలు ఉపయోగపడుతాయి. దీంతో పరిశ్రమల స్థాపనతో ఈ ప్రాంత రైతాంగానికి మరింత లాభం చేకూరుతుంది. వరి, మక్క పంటలను నేరుగా పరిశ్రమలకే విక్రయించుకునే వీలుంది.
– రాజారపు భూమేశ్వర్, ఆదర్శ రైతు, మెట్లచిట్టాపూర్
స్థానికులకే ఉద్యోగాలిస్తామనడం సంతోషం
ఇటీవల మెట్పల్లికి వచ్చిన మంత్రి కేటీఆర్ మా గ్రామంలో ఇథనాల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్లాంట్లు ఏర్పడితే 2300 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. అది కూడా స్థానికులకే ఇస్తామని చెప్పడం సంతోషం. మా ప్రాంతంలో ఇంటర్ దాకా చదువుకున్న యువత పెద్ద సంఖ్యలో ఉన్నారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్హతతో పని కల్పించాలి. అప్పుడే మాలాంటి వాళ్లకు ఉపాధి దొరుకుతుంది.
– మహ్మద్ అరీఫా, యువతి, మెట్లచిట్టాపూర్.
ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం
పరిశ్రమలు ఏర్పడిన తర్వాత కంపెనీ పెద్దలు రైతుల పంటలను ఇక్కట్లు లేకుండా కొనాలి. అప్పుడే పంటలను ఎక్కువ పండించాలన్న కసి రైతుల్లో ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు కొంటే సరిపోతుంది. ప్లాంట్లతో భూమి ఉన్నోళ్లకు, లేనోళ్లకు కూడా ఉపాధి దొరుకుతుంది. మా ఊరిలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పూనుకున్న ఎమ్మెల్యే సారుకు రుణపడి ఉంటా.
– బద్దం హన్మంతు, రైతు, మెట్లచిట్టాపూర్
మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
పరిశ్రమల ఏర్పాటుతోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చదువుకున్న యువతీ,యువకులు చాలా మంది ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ఇక్కడే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రభుత్వం మరిన్ని పరిశ్రమలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. మా గ్రామ శివారులో ఇథనాల్ ప్లాంట్లు నిర్మిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు.
– అల్లాడి సంపత్, యువకుడు, మెట్లచిట్టాపూర్