విద్యానగర్, జూలై 1: వైద్యుల సేవలు వెలకట్టలేనివని, సమాజంలో వారి పాత్ర కీలకమని, కొవిడ్ తర్వాత డాక్టర్ల ప్రాముఖ్యత మరింత పెరిగిందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. జాతీ య డాక్టర్ల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొవిడ్ అనంతరం సమాజంలో డాక్టర్ ప్రాముఖ్యత, విలువ పెరిగిందని, ప్రాథమిక ఆరోగ్య వైద్య అధికారులు కేవలం చికిత్సపై కేంద్రీకరించకుండా ప్రజారోగ్యం, సామాజిక స్థితిగతులు అంచనా వేసి వ్యాధులను ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అంతకుముందు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రసవాలు, సీజనల్ వ్యాధులపై శుక్రవారం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలను నమోదు చేయాలని వైద్యాధికారులు, అంగన్వాడీ కార్యకర్తలను కలెక్టర్ ఆదేశించారు. డెంగీ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రతి గ్రామంలో పంచాయతీ సెక్రటరీ, ఇతర శాఖల సమన్వయంతో మంగళవారం, శుక్రవారం డ్రై డే ను పాటించాలన్నారు. దోమల అభివృద్ధి నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, అంగన్వాడీ సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.