తిమ్మాపూర్ రూరల్, జూలై 1: మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ‘సృజన నిర్మాణ్’ పేరిట ‘జాతీయ స్థాయి స్టూడెంట్స్ టెక్నికల్ సింపోసియం’ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. యూఎస్ఏకు చెందిన సెక్యూరిటీ రీసెర్చర్ పాలబందెల సాయిరాం ముఖ్యఅతిథిగా హాజరై, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. సైబర్ క్రైం, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, ఐవోటీ వంటి అంశాల ప్రాముఖ్యతను వివరిస్తూ.. విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణలు చేయాలని సూచించారు.
పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, కోడింగ్ కంటెస్ట్, స్పాట్ డిజైనింగ్, టెక్నికల్ క్విజ్, ప్రాజెక్ట్ ఎక్స్పో తదితర ఈవెంట్స్ను కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్రావుతో కలిసి సాయిరాం ప్రారంభించారు. కళాశాల చైర్మన్ సాగర్రావు మాట్లడుతూ.. ఇలాంటి కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సుమారు వెయ్యి మంది హాజరు కాగా, వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తామని ప్రిన్సిపాల్ శ్రీనివాస్రావు తెలిపారు. కార్యక్రమ ఇన్చార్జి డాక్టర్ మణికందన్, కో-కన్వీనర్ డాక్టర్ నీలిమా, డాక్టర్ కార్తీక్గణేశన్ పాల్గొన్నారు.