స్వరాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నింటా అగ్రగామిగా నిలుస్తున్నది. తరలివచ్చిన కాళేశ్వర జలాలతో పచ్చబడ్డ బీడు భూములను చూసి రైతాంగం మురిసిపోతున్నది. రైతుబంధు, 24 గంటల ఫ్రీ కరెంట్ లాంటి స్కీంలతో భరోసానిస్తున్న తెలంగాణ సర్కారుకు మనసారా కృతజ్ఞతలు చెబుతున్నది. విరివిగా నిధులు వెచ్చించి సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించింది. అన్ని సౌకర్యాలతో గురుకులాలను ఏర్పాటు చేయడంతో అన్ని వర్గాలకు నాణ్యమైన విద్య అందుతున్నది. దళితబంధు పథకం తెచ్చి దగాపడ్డ బతుకుల్లో వెలుగులు నింపుతున్నది.
– ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ‘తొమ్మిదేండ్ల క్రితం సంక్షోభంలో ఉన్న కరీంనగర్ జిల్లా నేడు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు అందించిన సహకారంతో అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుస్తున్నది.’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ దీక్ష చేసి రాష్ర్టాన్ని సాధించి..ప్రజల మద్దతుతో అధికారం చేపట్టిన ఆయన తెలంగాణ సమాజం ఆత్మగౌరవంతో బతికేలా అనేక పథకాలకు రూపకల్పన చేశారని చెప్పారు.
ఆయన నాయకత్వ పటిమతో ఈ రోజు తెలంగాణ స్వయం అస్తిత్వంతో ఐశ్వర్యవంతంగా విలసిల్లుతున్నదని చెప్పారు. శుక్రవారం కరీంనగర్లోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో అట్టహాసంగా నిర్వహించిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగుర వేశారు. పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. అమరులకు ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లు, శకటాలను తిలకించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఉమ్మడిపాలనలో సాగునీరందక రైతాంగం ఆగమైందన్నారు. కానీ ఈ రోజు తెలంగాణ అంటే ప్రవహించే నదులను కలిపిన కాళేశ్వరం ప్రాజెక్టు, కోటి ఎకరాల మాగాణి గుర్తుకువస్తుందని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ను చూసి ప్రతి రైతు తమకు బంధువు దొరికాడని సంతోషిస్తున్నారని చెప్పారు. 24 గంటల ఫ్రీ కరెంట్, గలగలా పారేటి నీళ్లలో ఇపుడు తెలంగాణ ఆకుపచ్చగా మారిపోయిందని అన్నారు. ఒక గొప్ప దార్శనికుడైన కేసీఆర్ నాయకత్వంలో విద్యా, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం స్వయం సిద్ధంగా, అప్రతిహాతంగా దూసుకెళ్తున్నదని పేర్కొన్నారు. ఆయన సారథ్యంలో రాష్ట్రం తొమ్మిదేండ్లలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22 వరకు నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని, ప్రజలందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండేదని, సీఎం కేసీఆర్ ఆర్థిక క్రమశిక్షణతో తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్ర జీఎస్డీపీ క్రమంగా పెరుగుతూ వస్తున్నదని, అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇవ్వడంతో సమ్మిళిత అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఇక్కడి డెవలప్మెంట్ మోడల్ గురించి ప్రతి రాష్ట్రంలో చర్చ జరుగుతున్నదన్నారు. తెలంగాణలోని పథకాలను దేశమంతా కోరుకుంటున్నదని అన్నారు. 2013-14లో కేవలం రూ. 1,21,162 మాత్రమే ఉన్న తలసరి ఆదాయం ఇపుడు రూ. 3,06,762కు పెరిగిందని అన్నారు.
మంత్రి గంగుల కమలాకర్ ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా సాధించిన ప్రగతిని నివేదించారు. ఒకప్పుడు సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పదేళ్లలో పండుగలా తీర్చిదిద్దారని అన్నారు. స్వయంగా రైతు అయిన సీఎం కేసీఆర్ పాలనలో రైతుల కళ్లలో దైన్యం తొలగి, ధీరత్వం తొణికిసలాడుతోందన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్, పంట రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం, రైతుబం ధు సమితుల ఏర్పాటు, రైతుబంధు, రైతు బీమా వంటి అనేక పథకాల కారణంగా ఈ రోజు రైతులు సంబురాల్లో మునిగితేలతున్నారని చెప్పారు. 2018 నుంచి ఇప్పటి వరకు సగటున 1,81,908 మంది రైతులకు రూ. 1,556.63 కోట్లు రైతుబం ధు కింద అందించామన్నారు. రైతు బీమా కింద 2,377 మంది రైతు కుటుంబాలకు రూ. 118.85 కోట్లు అందించామన్నారు.
సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో తాగు నీటి గోస తీరిందని, కలుషిత జలం ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టడంలో సఫలీకృతులమయ్యామన్నారు. ఈ పథకం ద్వారా ప్రేరణ పొందిన కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్యోజన కార్యక్రమాన్ని తెచ్చిందని గుర్తు చేశారు. జిల్లాలో రూ. 1,492 కోట్లతో 22 కట్టడాలు, 1,231.96 కిలో మీటర్ల పైపు లైన్ నిర్మాణం పూర్తి చేసి 3 సెగ్మెంట్ల పరిధిలో 494 ఆవాసాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆహార భద్రత కల్పిస్తున్నదని అన్నారు. గతానికి భిన్నంగా ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలో 2,78,411 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటి ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు 336 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మానవీయ కోణంలో అమలు చేస్తున్న ఆసరా పథకం లక్షల మందికి అండగా నిలుస్తోందని చెప్పారు. గత ప్రభుత్వాలు కేవలం రూ. 200 మాత్రమే ఇవ్వగా సీఎం కేసీఆర్ దివ్యాంగులకు రూ. 3,016, మిగతా కేటగిరిల వారికి రూ. 2,016 చొప్పున పింఛన్ అందిస్తున్నారని అన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలో 1,41,344 మందికి రూ. 3,086.60 కోట్లు పంపిణీ చేశామన్నారు.
దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపిందని, అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని రూపొందించారని చెప్పారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున అందిస్తున్నామని, జిల్లాలో ఇప్పటి వరకు 18,231 దళిత కుటుంబాలకు రూ. 1,823 కోట్లు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. ఈ స్కీంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధించారని స్పష్టం చేశారు. విదేశీ విద్యనభ్యసించే దళిత బిడ్డలకు అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్ షిప్ కింద రూ. 20 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 22 వసతి గృహాలు, 9 కళాశాల వసతి గృహాలు నిర్వహిస్తున్నామన్నారు. దళితుల కుటుంబాలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామన్నారు.
చేతి వృత్తులపై ఆధారపడ్డవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి అన్నారు. జిల్లాలో గొర్రెల పంపిణీ పథకం కింద 2017-18లో, 2021-22లో 16,724 మంది గొల్ల కుర్మలకు 75 శాతం రాయితీపై గొర్రెలు పంపిణీ చేశామని చెప్పారు. త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ చేపడతామని తెలిపారు. పశు సంవర్ధక శాఖ ద్వారా 4,800 మందికి బర్రెలు పంపిణీ చేశామన్నారు. దళిత బంధు కింద హుజూరాబాద్ ని యోజకవర్గంలో 5,114 మందికి బర్రెలు అందించామన్నారు.
ప్రభుత్వ బడులను బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. దశల వారిగా డిజిటల్ విద్యా విధానాన్ని తెస్తామని వివరించారు. జిల్లాలో 213 స్కూళ్లను మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు. అన్ని స్కూళ్లల్లో టాయిలెట్స్ నిర్మాణం, తాగు నీటి సదుపాయం, విద్యుత్తు సౌకర్యం, ఫర్నీచర్, గ్రీన్ చాక్పీస్ బోర్డులు, ప్రహారీలు, అదనపు గదుల నిర్మాణం, డైనింగ్ హాల్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో 2,214 మంది విద్యార్థులు 10 జిపీఏ సాధిస్తే వెయ్యి మందికిపైగా ట్రిపుల్ ఐటీకి, మరో వెయ్యి పైగా విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్లను సాధించడం గొప్ప విషయమన్నానరు..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆడబిడ్డల పెండ్లిళ్లకు రూ. 1,00.116 ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ 32,696 మందికి రూ. 298.05 కోట్లు అందించామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ స్కీంను నీతి ఆయోగ్ సభ్యులు ప్రశంసించారని గుర్తుచేశారు.
వైద్య రంగంలో తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. ఈ రోజు దేశంలో అతి తక్కువ మాతృ మరణాలు జరుగుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నదని చెప్పారు. జిల్లాలో 26.55 కోట్లతో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించామని, ప్రభుత్వ దవాఖానలో రేడియాలజీ, ల్యాబ్, పాలియేటివ్ బ్లాక్, శిశు సంరక్షణ యూనిట్ వంటి సదుపాయాలు కల్పించామన్నారు.
రూ. 7.86 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్లు నిర్మిస్తున్నామన్నారు. జిల్లాకు కొత్తగా మెడికల్ కళాశాల మంజూరైందని, రూ. 7 కోట్లతో నిర్మాణం జరుగుతోందన్నాను. 52 బస్తీ, 73 పల్లె దవాఖానలు ఏర్పాటు చేశామన్నారు. రూ. 38 లక్షలతో డయగ్నోస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు., 10,15,875 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని అవసరమైన మందులు, అద్దాలు అందించామని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 53,001 మందికి కేసీఆర్ కిట్స్ అందించామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని మంత్రి ప్రశంసించారు.
రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా నిర్మించిన రోడ్ల విషయాన్ని ప్రస్తావించారు. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా వచ్చిన మార్పులను వివరించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ ఎల్ సుబ్బారాయుడు, మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణా రావు, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, ఆర్డీవో ఆనంద్, ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పాల్గొన్నారు..
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన శకటోత్సవాలు అలరించాయి. 18 శాఖల శకటాలను ప్రదర్శించారు. దేవాదాయ దర్మాదాయ శకటాన్ని మొదటి సారిగా ప్రదర్శించారు. వ్యవసాయ శాఖ శకటం అలరించి దీనికి మొదటి బహుమతి రాగా మంత్రి చేతుల మీదుగా జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ బహుమతిని అందుకున్నారు. దళిత బంధు శకటానికి రెండో బహుమతి వచ్చింది.