కరీంనగర్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ)/కలెక్టరేట్/ కార్పొరేషన్ : తెలంగాణలో పాలన అద్భుతంగా ఉందని, ఈ రాష్ట్రం దేశానికే దిక్సూచీగా ఉందని అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ప్రశంసించారు. పీపుల్స్పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు తాయ్ తడాప్, టెకీ కామా, బిరిజాయ్, దెబీయా తారా, చావ్ షోటికే హొపాక్, పీకే పులు, తదితరులు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించేందుకు గురువారం కరీంనగర్ జిల్లాకు వచ్చారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జిని సందర్శించడంతోపాటు మానేరు రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించారు. ఐటీ టవర్ను చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇసాన్ టెంపుల్.. టీటీడీ టెంపుల్స్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాలను చూసి పులకించిపోయారు.
నగరంలోని సుందరమైన రోడ్లు.. రాత్రి వేళ సెంట్రల్ లైటింగ్తో జిగేల్మంటున్న నగరాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. రాత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా వారి నివాసాల్లో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ భవిష్యత్లో భారత ప్రధాని కావడం తథ్యమని జోస్యం చెప్పారు.
ఇక్కడ జరిగిన అభివృద్ధి దేశ ప్రజలను ఆకర్షిస్తున్నదని స్పష్టం చేశారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశవ్యాప్తంగా కోరుకుంటున్న నేపథ్యంలో తాము బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు వెల్లడించారు. దశాబ్దాల తరబడి అనేక సమస్యలతో సతమతమవుతున్న అరుణాచల్ప్రదేశ్ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు ఇతర రాజకీయ పార్టీలను తమ రాష్ట్రంలో ఎదగనీయడం లేదని, గెలిచిన అభ్యర్థులను కొనుగోలు చేస్తూ పరిపాలన సాగిస్తున్నాయని ఆరోపించారు. సామాన్యుల పొట్టకొడుతున్న దుష్ట ప్రభుత్వాల ఆట కట్టిస్తూ, దేశాన్ని పాలించే సత్తా కేసీఆర్కే ఉందనే భావనతో, తాము బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు.
పార్టీని అరుణాచల్ ప్రదేశ్లో పూర్తిస్థాయిలో విస్తరించి, 2024 ఏప్రిల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు మెజారిటీ సెగ్మెంట్లు గెలుపొంది, బీఆర్ఎస్ పాలనను తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటేందుకు తమ వంతు కృషి చేయనున్నట్లు చెప్పారు.
తెలంగాణలో ప్రధానంగా విద్య, వైద్య రంగాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని, తద్వారా పేద, మద్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయన్నారు. ఈశాన్య రాష్ర్టాల్లో అత్యంత వెనుకబాటుకు గురైన అరుణాచల్ప్రదేశ్ తెలంగాణ రోల్ మోడల్ను ఆదర్శంగా తీసుకుంటే, అతి తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ అభివృద్ధి చెందుతుందనే భావనతో తాము బీఆర్ఎస్ను తమ రాష్ట్రంలో పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించారు. పదేళ్లలో కరీంనగర్లో జరిగిన అభివృద్ధిని చూస్తే చూడముచ్చటేస్తుందన్నారు. ఇంత అభివృద్ధిని ఊహించలేక పోయమన్నారు.
దశాబ్దాల పాలనతో దేశాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్, బీజేపీ పాలనకు చరమగీతం పాడుతూ, అభివృద్ధిని కళ్లెదుట సాక్షాత్కరింపజేయడమే బీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానమని అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అరుణాచల్ ప్రదేశ్ మాజీ ఎమ్మెల్యేలతో స్పష్టం చేశారు. ఉమ్మడి పాలనలో వివక్షకు గురైన తెలంగాణ స్వరాష్ట్రంలో అనతి కాలంలోనే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేలా జరిగిన అభివృద్ధి ఇతర రాష్ర్టాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తెలంగాణ మాదిరి దేశం పురోగతి చెందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధే బీఆర్ఎస్ను దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తోందన్నారు. సీమాంధ్రుల పాలనలో నిత్యం కల్లోలమయమైన తెలంగాణ, తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న నిరంతర అభివృద్ధితో ఆదర్శంగా మారిందని, దీనిని గమనిస్తున్న ఇతర రాష్ర్టాల్లోని ప్రజలు బీఆర్ఎస్ను ఆహ్వానిస్తున్నారని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయని, ఆయా రాష్ర్టాల్లో పోటీ చేసే అభ్యర్థులపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా కరీంగనగర్ సిటీలో జరిగిన అభివృద్ధిని పరిశీలించిన అరుణాచల్ ప్రదేశ్ మాజీ ఎమ్మెల్యేలు తాయ్ తడాప్, టెకీ కామా, బిరిజాయ్, దెబీయా తారా, చావ్ షోటికే హొపాక్, పికె పులు మంత్రి గంగుల కమలాకర్ను కలిసి అభినందించారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు. చాలా బాగా అభివృద్ధి చేశారని, ఇంత బాగా పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ను, మంత్రులను ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ మాజీ ఎమ్మెల్యేలు అభినందించారు.
మెట్రో సిటీల్లో రెండు, మూడు మెడికల్ కాలేజీలు ఉంటాయని, కానీ కరీంనగర్లో ఇప్పటికే రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నా ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత గంగుల కమలాకర్దని కొనియాడారు. చేయాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యపడుతుందని, మంచి కమిట్మెంట్ ఉన్న నాయకుడు అని అభినందించారు. ఇలాంటి నాయకుడు ఉండడం.. కరీంనగర్ చేసుకున్న అదృష్టమన్నారు. గంగుల నాయకత్వంలో కరీంనగర్ మరింత గొప్ప నగరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పని చేసే నాయకున్నే ప్రజలు ఆదరిస్తారని, రాబోయే ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మంత్రి గంగుల వారికి వివరించారు. అనంతరం వారిని మంత్రి గంగుల సన్మానించారు.