తరతరాల దోపిడీ నుంచి, సామాజిక వివక్ష నుంచి దళిత సమాజం శాశ్వతంగా విముక్తి పొందే మహోద్యమానికి శ్రీకారం చుడుతున్న. కరీంనగర్ మొదట్నుంచీ రాష్ట్ర సాధనలో ముందున్నది. అందుకే ఈ జిల్లా నుంచే దళితబంధును ప్రారంభిస్తున్న. ఈ పథకం అందరికీ అమలు చేస్తం. ఎవరికీ ఎలాంటి అనుమానాలు వద్దు. అందరూ ఒకటే ఉపాధి మార్గం ఎంచుకోవద్దు. ఊరంతా ట్రాక్టర్లే కొంటే గిరాకీ ఉంటదా..? మీరే ఆలోచించి అడుగులు వేయాలి. దళిత కుటుంబాలన్నీ అభివృద్ధిలోకి రావాలె.
2021 ఆగస్టు 16న శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష ఇది. ఆయన ఆశించినట్టే.. దళితసమాజానికి ఇప్పుడు మంచిరోజులు వచ్చాయి. దళితబంధు రాకతో తలరాతలు మారుతున్నాయి. శాశ్వత ఉపాధికి బాటలు పడి, కొత్త సంతోషాలు నిండుతున్నాయి.
వజ్రోత్సవాల వేళ దళితవాడల్లో కొత్త వసంతం విరబూస్తున్నది.. దశాబ్దాల చీకట్లు తొలిగి కొత్త వెలుగు విరజిమ్ముతున్నది.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన విప్లవాత్మక ‘దళిత బంధు’, దగాపడ్డ దళితబిడ్డల తలరాతలు మారుస్తున్నది.. సరిగ్గా ఏడాది క్రితం హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా పురుడు పోసుకున్న ఈ పథకం, సరికొత్త అధ్యాయం లిఖించింది.
ఏడాదిలోనే ఎన్నో ఏండ్ల వెనుకబాటును దూరం చేసి, కూలీనాలి చేసుకునే జీవితాల్లో ఎంతో మార్పు తెచ్చింది.. శాశ్వాత ఉపాధికి బాటలు వేసి, అపూర్వ విజయాలు సృష్టించింది.. మొన్నటిదాకా కూలీలు, డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు ఓనర్లుగా.. వ్యాపారవేత్తలుగా మారారు. సగర్వంగా సంపాదిస్తూ.. తమ కాళ్లపై తాము నిలబడడమే కాదు, మరో నలుగురికి ఉపాధి చూపుతూ సగౌరవంగా బతుకుతున్నారు. ఇదంతా కేసీఆర్ చలువేనని, తమకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామంటూ లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’కు శ్రీకారం చుట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇక్కడి దళితుల కోసం 2వేల కోట్లు కేటాయించారు. గతేడాది ఆగస్టు 16న శాలపల్లి- ఇందిరానగర్ వేదికగా ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఇచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించే అవసరం లేకుండా ప్రతి దళిత కుటుంబానికి సాయం అందిస్తున్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో 9.90 లక్షలు జమ చేయగా, మిగతా 10 వేలను దళిత నిధి పేరిట డిపాజిట్ చేశారు. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక మండలాల్లో 13,944 మంది లబ్ధిదారులను గుర్తించి, 11,480 మందికి యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. ఇంకా 2,464 యూనిట్లు గ్రౌండింగ్ చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 195 మంది లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ కోసం కలెక్టర్ వద్ద ప్రతిపాదనలు చేసి ఉంచారు.
ఇచ్చిన యూనిట్ను సద్వినియోగం చేసుకుని దళితబిడ్డలు ఆర్థికంగా స్థిర పడుతుండగా, మిగతా లబ్ధిదారులకు నెలరోజుల్లోనే గ్రౌడింగ్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ మొదటి విడుతగా నియోజకవర్గానికి వంద యూనిట్లు ఇస్తున్నారు. పంపిణీ దాదాపూ పూర్తి కాగా, నియోజకవర్గానికి మరో 1500 యూనిట్లు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు.
దళితులకు శాశ్వతంగా ఆదాయమిచ్చే, నచ్చిన, అనుభవమున్న రంగానికి సంబంధించిన యూనిట్లను ఎంచుకునేలా అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. ఎంచుకున్న యూనిట్లో అనుభవం లేకుంటే శిక్షణ కూడా ఇప్పించారు. దాంతో వేలాది మంది లబ్ధిదారులు ధీమాగా ఉపాధివైపు అడుగులు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడంతో ఏడాది క్రితం వరకు కూలీలు, డ్రైవర్లుగా ఉన్న వాళ్లు ఇప్పుడు వాహనాలు, దుకాణాలకు ఓనర్లుగా మారారు.
విద్యావంతులైన యువకులు కంప్యూటర్ సెంటర్లు, మెడికల్ షాపులు, మీ సేవ కేంద్రాలు, ఫొటో స్టూడియోలు పెట్టుకున్నారు. ఇంకొందరు సెంట్రింగ్, ఎలక్ట్రికల్, సిమెంట్, ఐరన్ అండ్ హార్డ్ వేర్, ఫుట్వేర్, ఫర్టిలైజర్, ఆటో మొబైల్, బట్టల షాపులు, బేకరీలు, సూపర్ మార్కెట్లు, డెయిరీలు ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు నడిపిస్తున్నారు. కొందరు గ్రూపుగా ఏర్పడి కూడా వ్యాపారాలను పెట్టుకున్నారు. సొంతంగా ఉపాధి పొందడంతోపాటు మరో నలుగురికి పని కల్పిస్తూ గౌరవంగా బతుకుతున్నారు.
ఇప్పుడు దళితులు ఉపాధి మార్గంలో పయనిస్తున్నారు. రోజూ వారీ ఆదాయాన్ని సంపాదించుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. ట్రాక్టర్ కొనుగోలు చేసుకున్న దళితులు ఇప్పుడు రోజుకు 2వేల నుంచి 3వేల దాకా సంపాదించుకుంటున్నారు. హార్వెస్టర్ కొనుగోలు చేసుకున్న వాళ్లయితే సీజన్లో రోజు 10వేల నుంచి 20 వేల దాకా సంపాదించుకుంటున్నారు. టాక్సీ కొనుగోలు చేసుకున్న డ్రైవర్లు కూడా రోజుకు కనీసం వెయ్యికి తగ్గకుండా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. మినీ సూపర్బజార్లు, కిరాణా షాపులు పెట్టుకున్న వారు రోజుకు కనీసం వెయ్యికిపైగా దాకా సంపాదిస్తున్నారు.
గ్రూపులుగా ఏర్పడి జేసీబీలు, ట్రిప్పర్లు, మినీ బస్సులు తీసుకున్న దళితులు స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చుకునే స్థితికి చేరుకున్నారు. దళితబంధుతో జీవితాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తుండగా, ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు రోజంతా కష్ట పడినా మూడు నాలుగు వందలు కూడా వచ్చేవి కాదని, ఇప్పుడు రోజుకు వెయ్యికిపైగా సంపాదిస్తున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. దళితబంధు రాకతో తమ బతుకులు, కుటుంబాలు గాడిన పడుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాతం తమ కుటుంబాలు రుణపడి ఉంటాయని కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఇల్లందకుంట మండలం లక్ష్మన్నపల్లికి చెందిన దార భాగమ్మ- సదానందంది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. వీరికి ఇద్దరు కొడుకులు భిక్షపతి, లక్ష్మణ్ ఉన్నారు. భార్యభర్తలిద్దరూ కూలీ పనిచేసేవారు. కొడుకులను ఉన్నంతలో చదివించారు. ఇల్లు గడువక పోవడంతో కొడుకులిద్దరూ పనిలో చేరారు. పెద్ద కొడుకు భిక్షపతి గ్రామంలోని చిన్న వాహనాల వద్ద క్లీనర్గా పనిచేసేవాడు. లక్ష్మణ్ హనుమకొండలో కారు డ్రైవర్గా పని చేసేవాడు. సదానందం,భాగమ్మ కలిసి గ్రామంలో కూలీ పనులకు వెళ్లేవారు.
పదేండ్ల కింద పెద్దకొడుక్కి, ఐదేండ్ల కింద చిన్నోడికి వివాహం చేశారు. అన్నదమ్ములిద్దరూ కలిసి జేసీబీ కొనాలని అనుకున్నారు. కానీ చేతిలో చిల్లిగవ్వలేక ఊరుకుండిపోయారు. కానీ దళిత బంధుతో వారి కల నెరవేరింది. తల్లీ, కొడుకులిద్దరూ ముగ్గురు కలిసి ఒక యూనిట్గా జేసీబీ కొనుగోలు చేశారు. ఈ బండికి మార్కెట్లో డిమాండ్ ఉండడం, రోజూ గిరాకీ వస్తుండడంతో డ్రైవర్ను పెట్టుకొని నడిపిస్తున్నారు. నెలకు రూ.లక్ష ఆదాయం వస్తున్నదని అన్నదమ్ములిద్దరూ చెబుతున్నారు.
– ఇల్లందకుంట, ఆగస్టు 15
హుజూరాబాద్, ఆగస్టు 15: కూలీ పనే జీవనాధారంగా ఏండ్లపాటు బతుకీడ్చిన కొత్తూరి రాధ జీవితం నిలబడ్డది. ప్రతిష్ఠాత్మక దళిత బంధు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా డెయిరీ యూనిట్ మంజూరు పత్రాన్ని అందుకున్న ఆమె, ఆర్థికంగా అభ్యున్నతి సాధించింది. భర్త మొగిలితో కలిసి డెయిరీని విజయవంతంగా నడుపుకుంటూ సంతోషంగా జీవిస్తున్నది. వివరాల్లోకి వెళితే.. హుజూరాబాద్ మండలం కనుకులగిద్దకు చెందిన కొత్తూరి రాధ- మొగిలి దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు. వీళ్లకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు జాగ తప్ప ఇతరత్రా ఆస్తిపాస్తులు ఏమీ లేవు.
కైకిలి చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీసేవాళ్లు. నానా తంటాలు పడి, అప్పొసొప్పో చేసి ఇద్దరు బిడ్డలకు పెండ్లి చేయగా, మరో కుమార్తె పెళ్లీడుకు వచ్చింది. కుటుంబాన్ని గెంటుకుంటూ వస్తున్న కొత్తూరి రాధ- మొగిలి దంపతులకు కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబందు పథకం అండగా నిలిచింది. రూ.10 లక్షలు రాగా మొదటి దఫాలో రూ.5.50లక్షలతో డెయిరీని ప్రారంభించారు. రూ.4లక్షలతో నాలుగు గేదెలు, రూ.1.50లక్షలతో రేకుల షెడ్డు, ఇతరాత్ర సౌకర్యాలకు వెచ్చించారు. నాలుగు గేదెలతో అన్ని ఖర్చులు పోను నెలకు రూ.15వేల ఆదా యం పొందుతున్నారు. రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబం ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నది.
హుజూరాబాద్ మండలం సిర్సపల్లికి చెందిన ఆకునూరి రాధ-సుధాకర్ దంపతులది సాధారణ మధ్యతరగతి కుటుంబం. సుధాకర్ ఓ ప్రైవేట్ డెయిరీలో సాధారణ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. చాలీచాలనీ జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. కొడుకును డిగ్రీదాకా చదివించాడు. ఏదైనా బిజినెస్ చేయాలని అనుకున్నా ఆర్థిక పరిస్థితులతో ముందడుగు వేయలేకపోయాడు.
కానీ ఆ కుటుంబానికి దళిత బంధు బతుకుబాట చూపింది పథకం కింద ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం-2 పేరున యూనిట్ మంజూరు కాగా, పట్టణంలోని జమ్మికుంట రోడ్డులో గత మార్చి1న ఫర్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్, సీడ్స్ షాపు ఏర్పాటు చేసుకున్నారు. కొడుకు ఆకునూరి సిద్ధార్థకు షాపు బాధ్యతలు అప్పగించగా, సక్సెస్ఫుల్గా నడుస్తున్నది. రోజుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వ్యాపారం జరుగుతుండగా, అన్నీ పోను నెలకు భారీగానే ఆదాయం వస్తున్నది.
ప్రతీది తోటి దుకాణాల్లో కంటే రేటు తగ్గించి విక్రయిస్తుండడంతో వ్యాపారం బాగా జరుగుతున్నదని సిద్దార్థ అంటున్నారు. సీఎం కేసీఆర్ తెచ్చిన దళిత బంధుతో ఉన్నత చదువు చదివిన నాకు చేతినిండా పని లభించడమే కాక జీవనోపాధికి తగ్గ ఆదాయం లభిస్తున్నదని, నా కుటుంబం బాగుపడ్డదని చెబుతున్నాడు.
– హుజూరాబాద్టౌన్, ఆగస్టు15
రెక్కాడితే డొక్కాడని మా బతుకులకు సీఎం కేసీఆర్ పెద్దదిక్కు అయిండు. నా భర్త రవీందర్ అనారోగ్యంతో మంచంల పడితే కుటుంబ భారమంతా నాపైనే పడ్డది. మా పాప సౌమ్య బీటెక్, కొడుకు సన్నీ పదో తరగతి చదువుతున్నడు. నేను పెట్రోల్ బంకులో వర్కర్గా పనిచేస్కుంట.. చాలీచాలని జీతంతో భర్త, పిల్లలను పోషించుకుంటున్న. అయితే ఎట్ల బతుకుడని మస్తు బాధపడ్డ.
మాకెవరూ సాయం జేత్తరని అనుకున్న. కానీ, సీఎం కేసీఆర్ సారు మాకు దేడుడైండు. దళిత బంధు తెచ్చి బతుకుబాట చూపిండు. నేను ఎర్టిగా కారు తీసుకున్న. మా అన్న రాకేశ్కు అప్పగించిన. మెయింటనెన్స్ ఖర్చులు పోను నెలనెలా రూ.9వేలు పంపిస్తున్నడు. నేను పెట్రోల్ బంక్లో పనిచేస్తూనే.. కారు ద్వారా వచ్చే డబ్బులతో నాపై భారం తగ్గింది. పిల్లల చదువులు, నా భర్త చికిత్సకు సరిపోతున్నయ్. ఏ ఆధారం లేని మాకు పెద్దదిక్కైన కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– రొంటాల సరిత (సీఎం చేతుల మీదుగా మంజూరు పత్రం అందుకున్న లబ్ధిదారురాలు) గాంధీనగర్, హుజూరాబాద్
సరిగ్గా ఏడాది కింద నేను శాలపల్లి-ఇందిరానగర్లో కేసీఆర్ చేతుల మీదుగా దళితబంధు మంజూరు పత్రం తీసుకున్న. అప్పుడే ‘మంచిగా బతికిచూపిస్తం సర్’ అని కేసీఆర్కు మాట ఇచ్చిన. నా భర్త పెయింటర్ వృత్తి చేస్తడు. ఆయన పేరు మీదే హుజూరాబాద్ పట్టణంలోని గ్యాస్గోదాంరోడ్లో సిమెంట్ అండ్ ఐరన్ షాపును పెట్టిన. నా చిన్న కొడుకు వెంకటేశ్ చూసుకుంటున్నడు. మొదట దఫా వచ్చిన రూ.5 లక్షలతో సిమెంట్, ఐరన్ తెచ్చినం. మొదటి నెల అన్నీ పోను రూ.5వేలు మిగిలినయ్. రెండో నెల రూ.10వేలు అచ్చినయ్. ఇప్పుడు ఖర్చులన్నీ పోను నెలకు రూ.10వేల నుంచి రూ.15వేల దాకా మిగులుతున్నయ్. మేం బతుకుడే కాదు.. ఇంకొంతమంది పని చూపినం. సీఎం కేసీఆర్ చలువతోనే మేం ఇయ్యాళ మంచిగ బతుకుతున్నం. ఆ సారుకు జీవితాతం రుణపడి ఉంటం.
– శనిగరపు సరోజన, మామిళ్లవాడ, హుజూరాబాద్ (సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంజూరు పత్రం అందుకున్న లబ్ధిదారు)
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు15: హుజూరాబాద్ పట్టణంలోని మామిండ్లవాడకు చెందిన మాతంగి రమేశ్ది నిరుపేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తుల్లేవు. బతుకుదెరువు కోసం 2003లో ఆటో కొనుగోలు చేసి అప్పులపాలయ్యాడు. చేసేదేమీ లేక ఆటో అమ్ముకొని.. పొట్టచేతపట్టుకొని భార్య శోభ, కూతురును తీసుకొని మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజూర్కు వలస వెళ్లాడు. అక్కడి స్నేహితుల సాయంతో ఓ ఆటో మెకానిక్ వద్ద చేరాడు. రోజంతా కష్టపడి వచ్చినదాంతో భార్యాపిల్లలను పోషించాడు. ఊరుకాని ఊరులో ఎంత కష్టపడ్డా బట్టపొట్టకే సరిపోయేది. కానీ, నాలుగు పైసలు వెనుకపడక పోయేవి.
ఇంత దూరం వచ్చి కష్టపడినా ఫలితం ఉండడం లేదని, సొంతూరిలో ఏదైనా చేస్తే బాగుండు అని చాలాసార్లు అనుకున్నాడు. కానీ, ఆర్థిక స్థోమత లేక నిరాశ చెందేవాడు. ఏడాది క్రితం సీఎం తెచ్చిన దళిత బంధు ఆయన జీవితానికి వెలుగు రేఖగా నిలిచింది. పథకం కింద రూ.10లక్షలు ఇస్తున్నారని తెలిసి భార్యాపిల్లలతో తిరిగి సొంతూరికి వచ్చాడు. యూనిట్ మంజూరు కావడంతో సంబురపడ్డాడు. నాలుగు నెలల క్రితం హుజూరాబాద్ బస్టాండ్ వద్ద స్నేహా ఆటో స్పేర్ పార్ట్స్, మెకానిక్ షాపును ప్రారంభించాడు. మెయిన్ సెంటర్ కావడంతో గిరాకీ బాగానే ఉన్నది. అటు ఆటోలు రిపేర్ చేసుకుంటూ.. ఇటు స్పేర్ పార్ట్స్ విక్రయిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. నెలకు రూ.15వేల నుంచి రూ.20దాకా సంపాదిస్తూ ఉన్న ఊళ్లో దర్జాగా బతుకుతున్నాడు.
ఇతని పేరు ఇల్లందుల హరీశ్. హుజూరాబాద్ మండలం జూపాక. ఇతనికి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు జాగ తప్ప ఏం ఆస్తులు లేవు. హరీశ్ అజాక్స్ (సిమెంట్, కంకర కలిపే మిషన్)నడుపుతూ కుటుంబాన్ని వెళ్లదీసేటోడు. ఇద్దరు కుమార్తెలను ప్రైవేట్లో చదివించేందుకు ఇబ్బందులు పడేవాడు. పని కోసం అజాక్ష్ (సిమెంట్ కంకర మిక్స్ చేసే మిషన్) నడిపేందుకు వందల కిలోమీటర్లు వెళ్లేవాడు. కానీ లాభం అంతంత మాత్రమే. పని వదిలేద్దామని ఎన్నోసార్లు అనుకున్నాడు.
బర్రెలు సాదుకొని దర్జాగా బతకాలని ఆశ పడ్డా అంత స్థోమత లేక నిరాశ చెందాడు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన దళితబంధుకు ఎంపికయ్యాడు. డెయిరీ యూనిట్ పెట్టుకున్నాడు. మొదటి దఫాలో నాలుగు పాడి గేదెలను కొనుగోలు చేసి పాల ఉత్పత్తితో నెలకు సరాసరి రూ.30వేల ఆదాయం పొందుతున్నాడు. ఇప్పటిదాకా రూ.2.50లక్షల ఆదాయం రాగా, అందులో ఖర్చులుపోను రూ.1.80లక్షల నికర లాభం పొందాడు. రెండో దఫాలో మరో మూడు గేదెలను కొంటానని హరీశ్ సంతోషంగా చెబుతున్నాడు. కేసీఆర్ సారు దయతోనే నాకు చేతి నిండా పని దొరికిందని, పాలతో మస్తు ఆదాయం దొరుకుతున్నదని సంతోషపడుతున్నాడు. తన బిడ్డలనూ బాగా చదివిస్తానని, తన జీవితాన్ని నిలబెట్టిన కేసీఆర్ సర్ను ఎన్నటికీ మరిచిపోనని అంటున్నాడు.
– హుజూరాబాద్, ఆగస్టు 15
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ నేతృత్వంలో ఇప్పటి వరకు 11,480 యూనిట్లు గ్రౌండింగ్ చేశాం. ఇంకా మిగిలిన యూనిట్లను ఈ నెలలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. దళిత బంధుకు ముందు, దళిత బంధు తర్వాత దళితుల జీవితాలను గమనిస్తే ఏడాదిలోనే అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ఏడాది కింద యూనిట్లు పొందిన లబ్ధిదారులు ఇప్పటికే ఆర్థికంగా స్థిర పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి కల్పించిన అవకాశాన్ని 99 శాతం మంది పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రౌండింగ్ చేసిన యూనిట్లను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నాం. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు చాలా సంతోషంగా ఉన్నారు.
– డీ సురేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ (కరీంనగర్)
నా పేరు రాచపల్లి నాని. నా ఊరు జమ్మికుంట మండలం రాచపల్లి. కొడుకు సిద్ధార్థ ఇంటర్, బిడ్డ శ్రీవల్లి ఏడో తరగతి సదువుతున్నరు. ఇంతకు ముందు జమ్మికుంటలో బజ్జీల బండి దగ్గర నేను రోజువారీగా పనిచేసేది. పనిలేకపోతే వ్యవసాయ పనులకు కూలీగా పోయేటోన్ని. రోజుకు రూ.300 నుంచి రూ.400 దాకా వస్తుండె. నా భార్య ఉమ సైతం కూలీకి పోయేది.
రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తే ఇంటి ఖర్చులు, పిల్లల సదువులకే అయిపోయేవి. మాకు దళిత బంధు వచ్చినంక భరోసా పెరిగింది. వచ్చిన డబ్బులతో మొబైల్ టిఫిన్ సెంటర్ ట్రాలీ ఆటోను కొన్న. నేను నా భార్య కలిసి జమ్మికుంటలో నడుపుతున్నం. రద్దీగా ఉండే ప్రాంతంలో టిఫిన్ సెంటర్ పెట్టడంతో మా కష్టాలు గట్టెక్కినయి. నెలకు రూ.30వేల పైనే సంపాదిస్తున్నం. ఒకప్పుడు కూలీలుగా పనిచేసిన మేం ఇప్పుడు మొబైల్ టిఫిన్ సెంటర్కు ఓనర్లయినం. కేసీఆర్ దయతో తమ బతుకులు మారినయ్. చాలా సంతోషంగా ఉంది.
– రాచపల్లి నాని, రాచపల్లి (జమ్మికుంట రూరల్)
బర్రెలు కొనుక్కుంటామని కలలో కూడా ఊహించలే. నాకు బర్రెలు సాదుకోవాలని ఆశ ఉండేది. డబ్బులతో కూడుకున్న యావారం కనుక ఆశ కొట్టేసుకున్నా. కేసీఆర్ సారూ చేయబట్టి నా కల నెరవేరింది. కైకిలికి పోతే ఏమి మిగలలేదు. నాట్లు వేసినప్పుడు ఓ నెల రోజులు పని దొరికేది. ప్రస్తుతం పాల పైసలు వస్తుంటే సంబురం అనిపిస్తుంది.
– కొత్తూరి రాధ, లబ్ధిదారురాలు
కేసీఆర్ సారు దయవల్ల మా కష్టాలు తీరినయ్. చేతి నిండా పని దొరికింది. మొదలు ఈనిన బర్రెలు ఎదకు వస్తే కట్టేందుకు సూది వేయించిన. పైసలు కూడబెట్టి చిన్న బిడ్డ పెళ్లి ఘనంగా చేస్తా. కానిస్టేబుల్, ఎస్సై ట్రైనింగ్ కోసం మా బిడ్డకు రూ.20వేల దాకా ఖర్చు కూడా పెట్టిన. ఇప్పుడు మేం రందీ లేకుండా ఉన్నాం. కేసీఆర్ సారుకు ఎప్పుడూ రుణపడి ఉంటాం.
– కొత్తూరి మొగిలి, లబ్ధిదారురాలు భర్త
హుజూరాబాద్, ఆగస్టు 15: ఇతని పేరు శనిగరం కుమార్. ఊరు హుజూరాబాద్ మండలం చెల్పూర్. ఇతనికి ఇద్దరు కొడుకులు కాగా, ఇటీవలే పెద్ద కొడుకుకు వివాహం జరిగింది. కుమార్కు ఇల్లుజాగ తప్ప ఇతర ఆస్తిపాస్తులు పెద్దగా లేవు. కుటుంబ పోషణకు ఆటో నడుపుకుంటూ జీవితం వెళ్లదీసేటోడు. ఆటో పాతది కావడంతో రోజంతా ఎంత కష్టపడి సంపాదించినా అచ్చినదంతా రిపేర్లకే సరిపోయేది. కొత్త ఆటో కొనాలని ఆశ పడ్డా అంత స్థోమత లేక దాంతోనే కాలం వెళ్లదీసుకుంటూ రాసాగాడు.
ఇలా డొక్కు ఆటోతో అష్టకష్టాలు పడుతూ బతుకుబండిని లాగుతున్న కుమార్కు కేసీఆర్ రూపంలో అదృష్టం కలిసివచ్చింది. దళితబంధు దారిచూపింది. పథకం కింద వచ్చిన రూ.10 లక్షలతో ఆరు నెలల క్రితం మినీ ట్రక్కు(బొలేరో) కొనుగోలు చేసి రోజూ స్థిరమైన ఆదాయం పొందుతున్నాడు. మొత్తంగా నెలకు రూ. 24వేల ఆదాయం వస్తున్నట్లు కుమార్ తెలిపాడు. నిత్యం ఏదో గిరాకీ దొరుకుతున్నదని, రెండు నెలల క్రితం ధాన్యం కిరాయిలలో దండిగా ఆదాయం వచ్చిందని సంతోషంగా చెప్పాడు. ఖర్చులు పోను రోజుకు కొంచెం అటుఇటుగా రూ.800మిగులుతున్నాయని సంబురంగా పేర్కొన్నాడు.
ఏండ్లపాటు ఆటో డ్రైవర్గా పనిచేసిన నేను కేసీఆర్ సారు దయతో ట్రక్కుకు ఓనరయ్యాను. దళితబంధు లేకుంటే జీవితంలో ఈ బండి కొనకపోతును. పాత ఆటోతో ఎప్పుడు ఇబ్బందులు ఉండేవి. ట్రక్కు చేతికి వచ్చినప్పటినుంచి సంతోషంగా బతుకుతున్నా. చేతి నిండా పని దొరుకుతుంది. కేసీఆర్ సారుకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. నిత్యం ఇంటికి జేబులో డబ్బులు తీసుకొని పోతుంటే సంబురమేస్తుంది.
– శనిగరం కుమార్, చెల్పూర్(హుజూరాబాద్, ఆగస్టు 15)