ఉమ్మడి జిల్లాలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాకేంద్రాల్లోనూ వేడుకలు అంబరాన్నంటగా, ఆయాచోట్ల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంత్రి కేటీఆర్, జగిత్యాల ఖిలాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఐటీఐ కాలేజీ గ్రౌండ్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి, జాతినుద్దేశించి ప్రసంగించారు. తర్వాత ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందించారు. స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు.
నాటి సమైక్య పాలనలో వెనుకబడ్డ సిరిసిల్ల స్వరాష్ట్రంలో అహ్లాదాన్ని తనలో ఇమడ్చుకున్న పట్టణంగా శరవేగంగా ఎదుగుతున్నది. అనేక రంగాల్లో సిరిసిల్ల, వేములవాడ కార్మిక, ధార్మిక క్షేత్రాలు దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. స్వచ్ఛ సర్వేక్షణ్-2021 పోటీల్లో లక్షలోపు జనాభా గల కేటగిరీలో దక్షిణ భారతదేశంలోనే పరిశుభ్రమైన పట్టణంగా సిరిసిల్ల అవార్డు సొంతం చేసుకున్నది. 2021, 22 సంవత్సరానికి పట్టణ ప్రగతి ఇన్నోవేషన్ అవార్డుల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానం పొందింది.
15 వేల మంది నేతన్నలకు నిరంతరం ఉపాధినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం రూ.2500ల కోట్ల విలువైన వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చింది. 20 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా వేములవాడ మండలం నాంపల్లిలో రూ.260 కోట్లతో దక్కన్ అగ్రి రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇథనాల్ డిస్టిలరీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నాం. రాజరాజేశ్వర జలాశయం వద్ద 367 ఎకరాల విస్తీర్ణంలో 10 వేల మందికి ఉపాధి కల్పించేలా అతిపెద్ద ఆక్వాహబ్ను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం.
– సిరిసిల్లలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజల్లో దేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి మేలొలిపేలా ఈ నెల 8 నుంచి 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా, ప్రతి గుండెలో భారతీయత ఉండేలా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. వినూత్న పథకాలతో దూసుకెళ్తున్నది.
-పెద్దపల్లిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
భారత స్వాతంత్య్ర సంగ్రామం చరిత్రలో ఎంతో విశిష్టమైనది. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. వారి ఆశయ సాధనకు అందరం కలిసి కృషి చేద్దాం. మనం కోరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం దేశానికే తలమానికంగా ఉండేలా ఎన్నో వినూత్నమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. స్వతంత్ర భారతావని 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 8 నుంచి 22వ వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వాత్రంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
– జగిత్యాలలో రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్