కలెక్టరేట్, ఆగస్టు 15: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సోమవారం నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 75వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పలువురు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్న పలు విభాగాల ఉన్నతాధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
వజ్రోత్సవ వైభవంపై పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గేయాలు, ప్రదర్శించిన నృత్య గీతాలను వీక్షించారు. సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన శకటాలు, స్టాళ్లను తిలకించారు. త్రివర్ణ శోభిత వాటర్ డిస్ప్లే షోను ప్రదర్శించిన జిల్లా అగ్నిమాపక శాఖ యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. అనంతరం ఆసరా పెన్షన్ల కొత్త లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు అందజేశారు.
రైతుబీమా కింద పలు కుటుంబాలకు రూ.5లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా పరేడ్ మైదానంలో నగరంలోని పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు అలరించాయి. డ్రోన్తో రసాయన మందులు పిచికారీ చేసే ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, పోలీస్ అధికారులతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, టీఆర్ఎస్ నాయకుడు నందెల్లి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.