కలెక్టరేట్, జనవరి 8: కరీంనగర్ అభివృద్ధి బాగుందని, పదిహేనేండ్ల క్రితం తాను కరీంనగర్కు వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు చెందిందని భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. నగరమంతా హరితమయంగా మారిందని, ఎటుచూసినా పచ్చదనంతో కళకళలాడుతున్నదని చెప్పారు. గతంలో తాగునీటికి సైతం తండ్లాడే ఈ ప్రాంత వాసులు, ప్రస్తుతం నిండు జలాశయాలతో ఏటా మూడు పంటలు తీసే స్థాయికి ఎదిగారని, ఇదంతా సీఎం కేసీఆర్ చలవతోనే సాధ్యమైందని కొనియాడారు. పితృవియోగంతో ఉన్న రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి గంగుల కమలాకర్ను ఆదివారం ఆయన ఇంట్లో పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. తండ్రి మరణంతో శోకసముద్రంలో మునిగిన గంగుల సోదరులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
గంగుల మల్లయ్యకు శ్రద్ధాంజలి ఘటించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు తరలిరావడం, ప్రజల్లో ఆయనకున్న ఆదరణ స్పష్టమవుతున్నదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని చెప్పారు. దూరదృష్టితో వ్యవహరిస్తూ తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి పథకాల ఫలాలు ఇక్కడి ప్రజలకు అందివస్తుండడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు ఏర్పడ్డాయని, తెలంగాణలో పుష్కలంగా నీరు లభించడం, 24గంటలపాటు విద్యుత్ సౌకర్యం కల్పిస్తుండడంతో పంటల ఉత్పత్తి బాగా పెరిగిందని వివరించారు.
మంత్రి గంగులకు ఎంపీలు, ఎమ్మెల్యేల పరామర్శ
పితృవియోగంతో శోకతప్తంగా మారిన మంత్రి గంగుల కుటుంబాన్ని ఆదివారం పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ జాతీయ, రాష్ట్ర నాయకులు పరామర్శించారు. మంత్రి గంగుల తండ్రి మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. మంత్రి గంగుల సోదరులను ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. పరామర్శించిన వారిలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పట్నం మహేందర్రెడ్డి, పెద్దపల్లి జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధూకర్, రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు.