తెలుగు యూనివర్సిటీ, జూలై 27: తమ సమస్యలు పరిష్కరించడంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ అలసత్వం వహిస్తున్నదని రాష్ట్ర మత్స్య సహాకార సంఘాల సమైఖ్యకు చెందిన వివిధ జిల్లాల అధ్యక్షులు తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం రాష్ట్ర ఫిషరీస్ డైరక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ, జనగాం, మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు చొప్పరి సోమయ్య, బీ మల్లేశం, నీల రాజు, మన్నె రాజు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా చేప పిల్లల పంపిణీ సక్రమంగా జరగడం లేదని చెప్పారు. పంపిణీ ప్రక్రియలో అనేక లోపాలు, అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. 2026 మే 31తో ముగిసిన మత్స్యకారుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఇప్పటివరకు పునరుద్ధరించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఫెడరేషన్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించి, సభ్యత్వ ప్రక్రియలో లోపాలను సరిదిద్దాలని కోరారు. అర్హులైన మత్స్యకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.