తిమ్మాపూర్, మార్చి31: బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి వినోద్కుమార్ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని, ఆయనను గెలిపించుకుంటే కరీంనగర్కే కాకుండా తెలంగాణకు ఒక అభివృద్ధి కేంద్రంగా ఉంటారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆయన లాంటి మేధావులు తెలంగాణకు అవసరమని చెప్పారు. మండలంలోని అల్గునూరులో గల లక్ష్మీనరసింహ గార్డెన్లో మానకొండూరు నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ విద్యార్థి, యువజన కార్యకర్తల సమ్మేళనం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించగా, ఆయన బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఎన్నడూ జై తెలంగాణ అననోడు.. రాష్ట్రం మీద ప్రేమ లేనోడు మన ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరమని తెలిపారు. ఎన్నో ఏండ్లు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి.. నేడు రేవంత్రెడ్డి సీఎంగా ఉన్నాడంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షేనని స్పష్టం చేశారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనకు.. ప్రస్తుత పాలన చూస్తే రాష్ట్రంపై రేవంత్కు ఉన్న ప్రేమ అర్థమవుతుందన్నారు. నాడు మార్చిలో కుంటలు మత్తళ్లు దుంకితే.. నేడు ఎండిపోయి, బావులు, బోర్లు అడుగంటి కరువు కనిపిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిరసనగా ఢిల్లీలో చంద్రబాబు ధర్నా చేస్తుంటే ఆయన టెంట్ కింద కూర్చుని ఉన్న రేవంత్కు స్వరాష్ట్ర కాంక్ష, ఆత్మగౌరవం ఏం తెలుస్తుందని ప్రశ్నించారు.
చిన్న పదవి వచ్చినా అమరులకు నివాళులర్పించే సంస్కృతి మనదని, రేవంత్రెడ్డి ఉన్నత పదవి చేపట్టినా ఇప్పటి వరకు ‘జై తెలంగాణ’ అనడం గానీ, అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడం కానీ చేయలేదని విమర్శించారు. ఆయనకు ఢిల్లీకి గులాంగిరి చేయడం, సీఎం సీటు తప్ప తెలంగాణ ఆత్మగౌరవం తెలియదని ఎద్దేవా చేశారు. సెక్రటేరియట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేందుకు నాటి సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేస్తే, ఆ స్థానంలో తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేందుకు రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీ బానిసత్వానికి ఈ ఒక సంఘటన చాలు అని మండిపడ్డారు.
కఠోర శ్రమతో ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ లేకుంటే ఈ రోజు రేవంత్కు సీఎం పదవి, పీసీసీ అధ్యక్ష పదవి ఎకడిదని ప్రశ్నించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటున్న రేవంత్రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని, ఆయనకు ఇంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ పార్లమెంటుకు పోతే నోరు తిరగదని ఎద్దేవా చేశారు. ఒకరోజు కూడా సమస్యలపై మాట్లాడని బండి కావాలా..?, కరీంనగర్కు స్మార్ట్ సిటీ, హైవే రోడ్లు తెచ్చిన వినోద్ కుమార్ కావాలా? అని యువతను ప్రశ్నించారు. తిట్ల పురాణంలో బండి సంజయ్ పీహెచ్డీ చేశారని, ఓ వైపు రైతుల పంటలు ఎండుతుంటే.. బండి మాత్రం చెంగిచెర్ల వెళ్లి మత రాజకీయాలు చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, నాయకులు రావుల రమేశ్, కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మానకొండూరు నియోజకవర్గనికి ఒక బలం కావాలంటే వినోద్కుమార్ గెలవాలి. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో నేను చాలా అభివృద్ధి చేశా. ఆయన ఓడిపోయాక మరొక టర్మ్లో కొంత వెనుకబడిపోయా. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వైఫల్యాలు మరోసారి పునరావృతం కాకుండా కేడర్ అప్రమత్తంగా ఉండాలి. వినోద్కుమార్ను గెలిపించుకొని తీరాలి. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు ఇప్పటికే పెరిగాయి. మనకు పెద్దదికు వినోద్కుమార్ పదవిలో లేకపోతే మరింత ఇబ్బంది అవుతుంది. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి కారు గుర్తును గెలిపించుకోవాలి.
– మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషిచేసిన వినోద్కుమార్ను అందరం కలిసికట్టుగా ఉండి గెలిపించుకోవాలి. ఎకడా సమన్వయం లోపించకుండా నిబద్ధతతో పని చేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ గతంలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధిని వివరించాలి. వినోద్ కుమార్ గెలిస్తే తెలంగాణ నినాదం ఢిల్లీ స్థాయిలో ఉంటుంది.- బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు
రాష్ర్ర్టానికి, కరీంనగర్ స్మార్ట్ సిటీ, హైవే రోడ్లకు రూ.కోట్ల నిధులు తెచ్చి చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోకపోవడం మేం చేసిన పెద్ద తప్పు. లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్ ఒకరోజు కూడా ఆర్డర్ కాపీలు ఇస్తూ ప్రచారం చేసుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వం వేసిన ఉద్యోగాలను రేవంత్రెడ్డి ఇచ్చినట్టు ఫోజు కొట్టుకుంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరం. నేటి యువత తెలంగాణ ఉద్యమ చరిత్ర చదవాలి. నాటి, నేటి పరిస్థితులు తెలుసుకోవాలి.
తెలంగాణ వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి 125 అంతస్తుల ఎత్తు అంత ఉండే మల్లన్నసాగర్కు నీటిని అందించిన ఘనత కేసీఆర్ది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారింది. బీఆర్ఎస్ పాలనలో ఒక బావిలో కూడా పూడిక తీయలేదు. ఇప్పుడు ఎకడ చూసినా బావుల తవ్వకాలు కనిపిస్తున్నాయి. రైతులు, తెలంగాణపై ప్రేమలేని సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. నన్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా.
– బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి వినోద్కుమార్