కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు అన్ని వేళల్లో కృషి చేస్తామని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక కోర్టు చౌరస్తాలోని ఆయ న విగ్రహం, చిత్రపటానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజ య, నగర మేయర్ యాదగిరి సునీల్రావుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ దేశం సమైక్యంగా ఉందంటే అది అంబేద్కర్ వల్లేనని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని సవరించి పెద్ద ఎత్తున మార్పులు చేస్తామని బీజేపీ చెప్పడం సరికాదని, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని తెలిపారు. బీఆర్ఎస్ ముందు నుంచి అంబేద్కర్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పనులు చేపడుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, మెండి శ్రీలత చంద్రశేఖర్, సరిళ్ల ప్రసాద్, గంట కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.