కార్పొరేషన్, డిసెంబర్ 16: ‘జేపీ నడ్డా నోరు అదుపులో పెట్టుకో. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండి నీ సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేని నీవు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నవ్. అక్కడి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా బుద్ధి రాలేదా..? ఫస్ట్ నీ ఇలాకా చక్కబెట్టుకో’ అంటూ బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఘాటుగా విమర్శించారు. ‘మీరు, మీ పార్టీ నేతులు చెప్పే మాటలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని, మొన్నటితోనే మీ పార్టీ పనైపోయిందని, ఇక భూస్థాపితమే’నని మండిపడ్డారు. అసలు తె లంగాణలో మీ పార్టీకి సరైన నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారా..? ఒక్కసారి ఆలోచించు. పదేపదే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటున్నవ్. ప్రాజెక్టు గురించి నీకేం తెలుసు. ఒక్కసారైనా చూసినవా..? వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. దమ్ముంటే మీ ఆధీనం లో ఉన్న సంస్థలతో ఎంక్వైరీ చేయించి నిరూపించు. అంతేగానీ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు’ అంటూ హెచ్చరించారు.
కరీంనగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయతో కలిసి ఆయన మాట్లాడారు. ఒకప్పుడు అడుగంటిన చెరువులు ఇపుడు వేసవిలోనూ అలుగు పారుతున్నయని, కాలువల్లో నిండా నీళ్లుంటున్నాయని, మొన్నటిదాకా బీడు పడ్డ భూముల్లో ఇప్పుడు బంగారు పంటలు పండుతున్నాయన్నారు. ఈ రోజు వ్యవసాయరంగం లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందం టే అందుకు కారణం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టేనని చెప్పారు. ఇవన్నీ మీకు తెలిసినా జీర్ణించుకోలేక, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో రకంగా బద్నాం చేయాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ప్రజలన్నీ గమనిస్తున్నారని, ఇక్కడ మీ మాటలు నమ్మేవాళ్లు ఎవరూ లేరని, 2023 డిసెంబర్లో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని స్ప ష్టం చేశా రు.
బీఆర్ఎస్ ఏర్పాటుతో బండి సం జయ్ గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయని, భయంతో ఏదేదో మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ది ప్రజాసంగ్రామ యాత్ర కాదని, కేవలం బక్వాస్ యాత్రగానే మారిందన్నారు. కరీంనగర్ బహిరంగ సభలో అసలు సిసలైన బీజేపీ నేతలు ఎక్కడున్నారని, పొలిటికల్ బ్రోకర్ ఈటల రాజేందర్, ఇటీవల పార్టీ లో చేరిన నాయకులే కనిపించారని దుయ్యబట్టారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చీటీ రాజేందర్రావు, వొడ్నాల శ్రీనివాస్గౌడ్, ఉదారపు మారుతి, యూసుఫ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.