ప్రైవేట్ దవాఖానల్లో మాయాజాలం
నిబంధనలు విస్మరిస్తున్న పలువురు వైద్యులు
చికిత్స పేరిట రోగులకు లేనిపోని భయాలు
కరీంనగర్, ఏప్రిల్ 16 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న వారికి రెమ్డెసివిర్ ఇస్తే కొంత సానుకూల ఫలితం వచ్చినట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ఊపిరి ఆడని కొవిడ్ రోగులకు, ఆక్సిజన్ అందని వ్యాధిగ్రస్తులకు మాత్రమే ఈ ఇంజెక్షన్ వాడాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేసింది. మితంగా అవసరాన్ని బట్టి వాడాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇంజెక్షన్లను కేవలం హాస్పిటళ్లకు మాత్రమే అందించాలని, కెమిస్టులు, రోగులకు నేరుగా సరఫరా చేయవద్దంటూ హెచ్చరించింది. వ్యాక్సిన్ రాక ముందు ఈ మందును నివారణకు అస్త్రంగా వాడినా, దీనిని అనవసరంగా వాడితే దుష్ఫ్రభావం ఉండే ప్రమాదమున్నది. అయితే, కరోనాకు రెమ్డెసివిర్ ఒక్కటే మందు అన్న భావన చాలామందిలో బలంగా నాటుకొని పోయింది. ఇటీవల సెకండ్ వేవ్ ఉధృతమైన నేపథ్యంలో సహజంగానే ఈ రెమ్డెసివిర్కు డిమాండ్ పెరిగింది. చాలా దవాఖానల్లో నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. అవసరం లేకున్నా కరోనా బాధితులకు ఇష్టారాజ్యంగా ఇంజెక్షన్లను రాస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. వైద్యులం మాకు తెలుసా..? మీకు తెలుసా..? రోగి పరిస్థితి మెరుగు పడాలా..? లేదా..? అంటుండడంతో రోగి బంధువులు ఆందోళన చెందుతూ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కోసం మార్కెట్లో పరుగులు పెడుతున్నారు.
భయపెట్టి దందా..
రెమ్డెసివిర్కు ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకొని.. పలు దవాఖానలు తమ వ్యాపార ధోరణి ప్రదర్శిస్తున్నాయి. రోగిని దవాఖానలో చేర్చుకునే ముందు రెమ్డెసివిర్ తమ వద్ద ఉందో లేదో చెప్పడం లేదు. చేర్చుకున్న ఒకటి రెండు గంటలలోపు రకరకాల చికిత్సలు చేసినట్లుగా చూపి.. అప్పటికే భారీ బిల్లులు చేసి.. అప్పుడు రెమ్డెసివిర్ కావాలని చెబుతున్నారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక బంధువులు ఒత్తిడికి గురవుతున్నారు. దీనిని కొంత మంది వ్యాపారంగా మార్చుకుంటున్నారు. నిజానికి ఐదు కంపెనీలు ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను తయారు చేస్తున్నాయి. సిప్లా, జిడ్యూస్కడిలా, మైలాన్, హెటెరో, డాక్టర్ రెడ్డీస్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో ఆయా కంపెనీల ఒక్కో ఇంజెక్షన్ ఎమ్మార్పీ ధర 2,800 నుంచి 5,400ల వరకు ఉన్నది. కంపెనీల నుంచి బయటకు వచ్చాక మందులోళ్లు.. తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. ‘ప్రస్తుతం రెమ్డెసివిర్ ఎమ్మార్పీకి దొరకడం లేదు. బ్లాక్లో మాత్రం పది వేలకు తక్కువగా విక్రయించడం లేదు.’ అంటూ భయపెడుతున్నారు. నిజానికి పలు దవాఖానల్లో కొంత స్టాక్ ఉన్నా.. తమ దవాఖానలో చేరితేనే ఇస్తామంటూ షరతులు పెడుతున్నారు. దీంతో చికిత్స ఇస్తున్న దవాఖాన నుంచి మరో దవాఖానలో చేరలేక టెన్షన్ పడుతున్నారు.
ఎగుమతులపై ఆంక్షలు
సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశ అవసరాల దృష్ట్యా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఎగుమతులపై తాజాగా కేంద్రం ఆంక్షలు విధించింది. ఆ మేరకు రోజువారీగా ఉత్పత్తవుతున్న వివరాలు.. జిల్లాలకు చేరుతున్న స్టాక్, వినియోగం వంటి తదితర వివరాలపై ఔషధ నియంత్రణ పరిపాలన (డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్) అధికారులు నిఘా పెట్టాలని ఆదేశించింది. కానీ, ఈ విషయంలో ఔషధ నియంత్రణాధికారులు మాత్రం పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి
IPL 2021: ధోనీసేన బోణీ.. కింగ్స్పై సూపర్ కింగ్స్ విజయం
ఏఆర్ రెహ్మాన్ కు రజినీకాంత్ విషెస్