మానకొండూర్ రూరల్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాల్లోని ఆడబిడ్డలకు వరంలా మారిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కొండపల్కల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఐదుగురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, ఏడుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆడబిడ్డ పుడితే భారంగా భావించే రోజులు పోయాయని, ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. అనారోగ్యం పాలైన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా కల్పిస్తున్నదని తెలిపారు. కాగా, చెక్కులను అందుకున్న లబ్ధిదారులు సీఎం కేసీఆర్తోపాటు ఎమ్మెల్యే రసమయి, జీవీ రామకృష్ణారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సైండ్ల శ్రీకాంత్ ఇటీవల చెంజర్ల వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, పార్టీ తరఫున మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.
పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. అనంతరం గ్రామానికి చెందిన కంది బాపురెడ్డి కుమారుడి రిసెప్షన్కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ రామంచ గోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్, ఉప సర్పంచ్ తోట రాజమౌళి, నాయకులు కడారి ప్రభాకర్, జనగాం శంకర్, కడారి రమేశ్, అడప శ్రీనివాస్, బండి సంపత్, నరహరి గణపతి రెడ్డి, సాదినేని సుధాకర్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.